హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్నది. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. చేప పిల్లల పంపిణీ 26న ప్రారంభించనున్నట్టు చెప్పారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణలో 1.98 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా రాష్ట్రంలో మత్స్య సంపద ఉత్పత్తి 4.24 లక్షల టన్నులకు పెరిగిందని వివరించారు. ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీతో రాష్ట్రంలోని 3.76 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని దాదాపు అన్ని నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చేప పిల్లల విడుదలకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఈ ఏడాదీ భారీస్థాయిలో మత్స్య సంపద ఉత్పత్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు.