Kaleshwaram Project | కరీంనగర్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాలుగు నెలల కిందట కాళేశ్వర జలాలతో కళకళలాడిన ప్రాజెక్టులు.. ప్రస్తుతం వెలవెల బోతున్నాయి. నిరుటి వరకు మండుటెండల్లో మత్తడి దూకిన చెరువులు ఇప్పుడు నెర్రెలుబారి దర్శనమిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ విషయంలో కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి వల్ల కాళేశ్వరం ఎత్తిపోతల పథకం-గోదావరినది-దాని అనుసంధాన ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి. వాటి కింద సాగయ్యే వ్యవసాయంతోపాటు.. ఆ జలాలనే నమ్ముకొని కొనసాగుతున్న మత్స్యపరిశ్రమ కూడా ఆగమవుతున్నది.
ప్రాజెక్టులు ఖాళీ కావడంతో చెరువుల్లో కావాల్సినంత నీరు లేక.. ఎండ ధాటికి తట్టుకోలేక టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా వేలాది కుటుంబాలకు చేరాల్సిన మత్స్యసంపద ఆవిరవుతున్నది. యావత్ మత్స్యపరిశ్రమ ఉనికికే ప్రమాదం వచ్చిపడింది. సుమారు 50 వేల కుటుంబాల జీవన విధానంపై ప్రభావం పడిందని మత్స్యకార్మిక లోకం ఆవేదన చెందుతున్నది. కేసీఆర్ పాలనలో రోజుకు రూ.2 వేల సంపాదన పొందిన మత్స్యకారులు.. ప్రస్తుతం ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్నట్టు వాపోతున్నది.
మత్స్యపరిశ్రమకు కేసీఆర్ జీవం
ఒకప్పుడు తెలంగాణ మత్స్య పరిశ్రమకు కేరాఫ్గానే నిలిచినా.. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల విషయంలో జరిగిన వివక్షతో మత్స్యసంపద దాదాపుగా తగ్గిపోయింది. అప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలా అయితేనే చేపలు దొరికేవి. కానీ.. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభమైన తర్వాతి నుంచి నిన్న, మొన్నటి వరకు మత్స్య సంపదకు తెలంగాణ కేరాఫ్గా ఉన్న విషయం తెలిసిందే. సాగునీటి రంగ దశదిశను మార్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. అంతే శ్రద్ధతో మత్స్య పరిశ్రమకు జీవం పోసిన విషయం తెలిసిందే.
ఈ వృత్తిపై ఆధారపడిన వేలాది మంది జీవితాల్లో వెలుగులు నిండాయి. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ నుంచి మొదలుకొని.. అన్నారం-సుందిళ్ల-ఎల్లంపల్లి, నంది రిజర్వాయర్ వరకు, అలాగే శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు), దిగువమానేరు జలాశయం, అన్నపూర్ణ, ఎగువమానేరు జలాశయాలతోపాటు ఈ పరిధిలోని ప్రతి చెరువు నిత్యం నిండుకుండను తలపించాయి. ఫలితంగా.. మత్స్య కార్మికులకు ఉపాధి దొరికింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. గ్రామాలు, పట్టణాల్లో చేపల జాతర కనిపించేది.
వేలాది మందికి జీవనోపాధి
మేడిగడ్డ బరాజ్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ వరకు చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు చెందిన మత్స్యకార్మికులు చేపలు పట్టుకొని విక్రయించేవారు. ఈ ఐదు జిల్లాల్లో 735కుపైగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా.. వీటి పరిధిలో 53,389 మంది సభ్యులున్నారు. ప్రతి సంఘంలోని సభ్యుడికి ఈ మత్స్య సంపదతో సంబంధం ఉంది.
అంతేకాదు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నంది రిజర్వాయర్, శ్రీ రాజరాజేశ్వర జలాశయం, దిగువమానేరు, అన్నపూర్ణ, ఎగువ మానేరు పరిధిలో 5,956 మంది చేపలు పట్టుకోవడానికి అధికారికంగా లైసెన్స్లు జారీ చేశారు. లైసెన్స్లు లేని వేలాది మంది కార్మికులు కూడా ఈ వృత్తి అధారంగా జీవించేవారు. సంఘాల సభ్యులు, లైసెన్స్లు కలిగి ఉన్న మత్స్యకారులే కాకుండా ప్రత్యక్షం గా, పరోక్షంగా మరో 15 వేల నుంచి 20 వేల మందికిపైగా జీవనోపాధి పొందేవారు.
మత్స్య కార్మికుల ఉపాధికి ముప్పు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ ప్రభుత్వం కొన్ని వందల కోట్ల విలువ చేసే మత్స్య సంపదను సృష్టించింది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకోవడంతోపాటు విక్రయించుకునేందుకు సంపూర్ణ హక్కులను కల్పించింది. కేసీఆర్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ప్రతి కార్మికుడు దాదాపు రోజుకు రూ.2 వేల వరకు సంపాదించుకునేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేకపోగా.. దినదిన గండంగా మారడమేకాదు, మత్స్య సంపద మాయమైపోయే దుస్థితి వచ్చింది. మేడిగడ్డ బరాజ్ కుంగిందన్న ఒకే ఒక సాకు చూపి.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం లేదు.
బరాజ్ కుంగినా అక్కడే కాపర్ డ్యాం కట్టి.. పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చని సాగునీటి, ఇంజినీరింగ్ రంగ నిపుణులు చెప్తున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. ఫలితంగా ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో నీరు తగ్గిపోయి డెడ్ స్టోరీజీకి చేరుకొని మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల పరిధిలో మత్స్యకార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆ పైన ఉన్న సుందిళ్ల, ఎల్లంపల్లి, నంది రిజర్వాయర్ బరాజ్లలో నీరు తగ్గిపోవడంతో మత్స్య సంపద అంతంత మాత్రంగానే ఉన్నది.
శ్రీరాజరాజేశ్వర జలాశయం, దిగువమానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కేసీఆర్ సర్కారు హయాంలో.. శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని వాటర్ హబ్గా మార్చారు. ఇక్కడ ఆక్వాహబ్ ఏర్పాటు చేసేందుకు ప్రఖ్యాత ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ లోపు కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మధ్యమానేరు డెడ్ స్టోరీజీకి చేరుకోవడం చూస్తే ఆక్వాహబ్పై నీలినీడలు అలుముకున్నాయి. మత్స్య పరిశ్రమ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రాజెక్టులు నింపే విషయంపై దృష్టి పెట్టాలన్న డిమాండ్ వస్తున్నది.
ఇయ్యాల 50 మందికి కూడా పనిలేదు
కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత సిరిసిల్ల బ్రిడ్జి దాకా నీళ్లుంటుండే. పదేండ్లలో కరువెట్ల ఉంటదో తెలువదు. నీళ్లులేక ఎండిన వాగును గిప్పుడే సూత్తున్నం. పోయిన ఎండకాలంలో రకరకాల చేపలు పట్టుకుని అమ్మినం. బొమ్మెలు, రవ్వులు, పాపర్లు, బంగారు చేపలు, రొయ్యలు ఇలా మోయలేనంత బరువున్న చేపలు దొరికేటియి. ఇంకా మే నెల రానేలేదు. డ్యాంలో నీళ్లులేక చేపలన్నీ సచ్చిపోతున్నయ్. ఒక్క రవ్వులు తప్ప ఇంకేమీ దొరుకుతలేవు. సొసైటీలో ఉన్న రెండు వేల మంది చేపలు పట్టుకుని బతికినోళ్లం. ఇయ్యాల 50 మందికి కూడా చేతినిండా పనిలేదు.
-గడప రమేశ్, ప్రధాన కార్యదర్శి, సిరిసిల్ల మత్స్యపారిశ్రామిక సొసైటీ
మా.. దండి కట్టం అచ్చింది
ఈ గోదారి తల్లి దయతోటి ఎల్లంపల్లి ప్రాజెక్టుల ఆడుతూ.. పాడుతూ పని చేసుకుంట చేపలు పట్టుకొని బతికేటోళ్లం. కానీ, ఇప్పుడు మాదండి కట్టం అచ్చింది. రోజూ సాయంత్రం 3 గంటలకు వలలు ఏస్తం. రోజూ పొద్దున 5 గంటలకు ప్రాజెక్టుకు పోయి వలలు తీసి చేపలు జోకిచ్చి 10 గంటలకు ఇంటికి అస్తం. రోజుకు వెయ్యికిపైనే దొరికేది. పని జేసినట్టు అనిపియ్యకపోయేది. ఇగో.. ఇప్పుడు రొయ్యలు పడే టైం. రొయ్యలు శిఖారైతే ఇగ పంట పండినట్టే. పైసలే.. పైసలు. అట్లాంటి రోజులు మల్ల అత్తయా అనిపిత్తంది.
-ధర్మాజి సాయికుమార్, మత్స్యకారుడు, హౌసింగ్బోర్డ్ కాలనీ, రామగుండం మండలం