న్యూఢిల్లీ, ఆగస్టు 1: వాహన అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు రికార్డు స్థాయిలో వాహనాలను విక్రయించాయి. ప్రస్తుత నెలలో ధరలను పెంచబోతున్నట్టు ఆటోమొబైల్ దిగ్గజాలు ప్రకటించడం, జీఎస్టీ ప్రయోజనాలు లభించడం, వడ్డీరేట్లు తగ్గడం, రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు లభించడంతో వాహనాలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది.
గడిచిన నెలలో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 4.65 లక్షల నుంచి 4.7 లక్షలకు చేరుకున్నాయని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. కిందటేడాది ఇదే నెలలో 3.5 లక్షల స్థాయిలో ఉండగా, ఈ సారి 33 శాతం వరకు వృద్ధి నమోదైందన్నారు. గత నెలలో మారుతి 1,96,203 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించగా, హ్యుందాయ్ 54,210 యూనిట్ల విక్రయాలు జరిపింది.
హ్యుందాయ్ చరిత్రలో ఒక నెలలో ఈ స్థాయిలో వాహనాలను విక్రయించడం ఇదే తొలిసారని, కొనుగోలుదారుల నుంచి పలు మాడళ్లకు డిమాండ్ నెలకొనడం వల్లనే ఇది సాధ్యమైందని హ్యుందాయ్ ఎండీ, సీఈవో తరుణ్ గార్గ్ తెలిపారు. టాటా మోటర్స్ వాహన విక్రయాల్లో 58 శాతం పెరుగుదల నమోదుకాగా, మహీంద్రా 20 శాతం, హోండా కార్స్ ఇండియా 48 శాతం, టయోటా కిర్లోస్కర్ 5 శాతం, కియా 27.4 శాతం చొప్పున వృద్ధిని సాధించాయి.
