నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 14 : ఓ వైపు పదోతరగతి పరీక్షలు ప్రారంభం.. మరోవైపు తల్లిదండ్రుల మరణంతో పుట్టెడు దుఃఖంలోనూ విద్యార్థులు పరీక్షలు రాసిన ఘటన శనివారం పలుచోట్ల చోటుచేసుకున్నది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెంది న కే అపర్ణ స్థానిక నియో వివేకానంద పాఠశాలలో పదోతరగతి చదివి పరీక్షలకు సిద్ధమైంది. విద్యార్థిని తల్లి భానుప్రియ గురువారం అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం అంత్యక్రియలు పూర్తిచేశారు.
శనివారం వార్షిక పరీక్షలు ప్రారంభంకాగా.. కుటుంబసభ్యులు, స్నేహితులు నచ్చజెప్పడంతో అపర్ణ పరీక్ష రాసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండకు చెందిన కుమ్మరి నాగరాజు (45), అతడి భార్యతో కలిసి శుక్రవారం రాత్రి బైక్పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో నాగరాజు మృతిచెందగా, అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు ధనూష్ శనివారం తీవ్ర విషాదంలోనూ తూప్రాన్లోని కేంద్రానికి వెళ్లి పరీక్షరాశాడు. అనంతరం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మో త్కూరుకు చెందిన కూరెళ్ల ఎల్లయ్య గుండాల మం డలం వాస్తాకొండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
శుక్రవారం ఎల్లయ్యకు గుండెపోటు రావడంతో రాత్రి మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలోనూ ఎల్లయ్య కుమారుడు హర్షవర్ధన్ పట్టణంలోని సెక్రేడ్ హార్ట్ హైస్కూల్లో జరిగిన తెలుగు పరీక్షకు హాజరయ్యాడు. హర్షవర్ధన్ స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో విద్యనభ్యసించాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లికి చెందిన గరిడేపల్లి మణికంఠ అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మణికంఠ తండ్రి కొండల్రావు అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉన్న మణికంఠ బాధాతప్త హృదయంతో పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు.