సంగారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారని తెలిపారు. పటాన్చెరు సభలో గురువారం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు రాష్ట్రంలో తెలియనిది లేదని అన్నారు. ‘అలంపూర్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వరకు, భద్రాచలం నుంచి జహీరాబాద్ వరకు అన్ని జిల్లాలు, నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉన్నది. ఏ నియోజకవర్గంలోని ప్రజలకు ఏం అవసరాలున్నాయో తెలిసిన నాయకుడు కేసీఆర్. అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాలపై తనకున్న పట్టు, అవగాహనతో రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఏ రంగంలో చూసినా జాతీయ స్థాయి అవార్డులు తెలంగాణకే ఎక్కువ వస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు, ఐటీ, పరిశ్రమలు, వైద్యారోగ్యం, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ఫార్మా రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్దే’ అని కొనియాడారు. ఏడాదిలోపే సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ప్రజారోగ్యం, వైద్య రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి హరీశ్రావు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో వైద్యరంగాన్ని పట్టించుకోలేదని, నేడు వైద్యరంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. ‘తెలంగాణలో గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 17 వేల పడకలుంటే.. ప్రస్తుతం 50 వేలకు పెంచాం. గతంలో ఆక్సిజన్ బెడ్లు 1400 ఉంటే, ఇప్పుడు 34 వేలకు పెంచాం. గతంలో మెడిసిన్ కోసం తెలంగాణ పిల్లలు చైనా, ఉక్రెయిన్, రష్యా వెళ్లేవారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో వైద్యవిద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. గతంలో 20 ఏండ్లలో ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటైతే, ప్రస్తుతం 21 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినం. కాంగ్రెస్ హయాంలో 2,850 మెడికల్ సీట్లుంటే, నేడు 8,340 సీట్లకు పెంచినం’ అని వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, చింతా ప్రభాకర్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.