Minister Harish Rao | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఎన్సీడీ కిట్స్.. ఇలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కిట్స్ ఇస్తుంటే అభినందించాల్సిన ప్రతిపక్షాలు తిట్లు తిడుతున్నాయని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 ఏండ్లు గడిచి తర్వాత కూడా అదే ఉస్మానియా, అదే గాంధీ, అదే నిమ్స్ తప్ప వేరే దవాఖానలు కట్టలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలోనే ఎవరూ ఊహించని విధంగా వైద్యారోగ్యశాఖను బలోపేతం చేశామని తెలిపారు. నేడు తెలంగాణలో సర్కార్ దవాఖానలు కార్పొరేట్ హాస్పిటళ్లను తలదన్నేలా సేవలందిస్తున్నాయని చెప్పారు. బుధవారం నిమ్స్లో 2 వేల పడకల నూతన భవనం నిర్మాణానికి జరిగిని భూమి పూజ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నిమ్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు కీలకమైన రోజు అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్నదని, ఇందులో భాగంగానే 2 వేల పడకల దవాఖాన భవనానికి శంకుస్థాపన చేసుకొంటున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు, కొత్తగా వస్తున్న రోగాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యతను గత ప్రభుత్వాలు మరిచిపోయాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలను, పెరుగుతున్న జనాభాను, పెరుగుతున్న వ్యాధులను దృష్టిలో పెట్టుకుని 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నారని తెలిపారు. ‘వరంగల్లో 2,100 పడకలతో హెల్త్ సిటీ, అల్వాల్లో 1,200 పడకలతో టిమ్స్, ఎర్రగడ్డ, ఎల్బీనగర్, గచ్చిబౌలిలో సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నాం. తాజాగా నిమ్స్లో 2,000 పడకలతో మరో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇప్పటికే నాలుగు టిమ్స్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వరంగల్ హెల్త్సిటీ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి.
భవిష్యత్తులో కరోనా వంటి పరిస్థితులు వచ్చినా ప్రజలకు పూర్తి భరోసాతో మంచి వైద్యం అందించేలా రాష్ట్ర వైద్యారోగ్య వ్యవస్థను సీఎం బలోపేతం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆరోగ్యశాఖ పనిచేస్తున్నది. హైదరాబాద్ నగరం ఇప్పటికే ఐటీ హబ్గా, వ్యాక్సిన్ హబ్గా, ఫార్మా హబ్గా ఉన్నది. ఇప్పుడు హెల్త్ హబ్గా కూడా మారబోతున్నది. రాష్ట్ర ప్రజలకే కాకుండా వివిధ రాష్ర్టాలు, ఇతర దేశాల ప్రజలకు కూడా వైద్యం అందించే స్థాయికి మన ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. గత 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా నేడు అడుగు దూరంలోనే పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ బస్తీకి ప్రజల సుస్తీని నయం చేయడానికి 500 బస్తీ దవాఖానలు, ప్రతి జిల్లాకు 134 పరీక్షలు ఉచితంగా చేసే టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. గతంలో మూడే ఉన్న డయాలసిస్ సెంటర్లను నేడు 102కు పెంచాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగిల్ యూజ్డ్ డయాలసిస్ సేవలను ఉచితంగా అందిస్తున్నాం. ఆ రోగులకు ఉచిత బస్పాస్లు, ఆసరా పెన్షన్లు సైతం సీఎం కేసీఆర్ అందిస్తున్నారు’ అని హరీశ్రావు వివరించారు.
న్యూట్రిషన్ కిట్ కోసం ఎవరో దరఖాస్తు పెట్టలేదని, ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఒక తల్లిలా, ఒక తండ్రిలా ఎవరికి ఏమి కావాలో ఆలోచిస్తారని, ఈ క్రమంలోనే ఆయనే స్వయంగా ఆలోచించి రూపొందించిన కార్యక్రమమే న్యూట్రిషన్ కిట్ అని తెలిపారు. ఒక తల్లి గర్భం దాల్చిన తన బిడ్డ గురించి ఎలా ఆలోచిస్తుందో.. సీఎం కేసీఆర్ కూడా ఒక తల్లిలా, కుటుంబ పెద్దలా ఆలోచిస్తూ రేపు పుట్టబోయే బిడ్డ కూడా ఉత్తమంగా ఉండాలని, తల్లి ఆరోగ్యం బాగుండాలని న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు న్యూటిషన్ కిట్ ఒక వరంగా మారుతుందని తెలిపారు. కిట్లో ఉండే నెయ్యి, కర్జూర పండ్లు, హార్లిక్స్ ప్రొటీన్ మిల్క్ పౌడర్, బెల్లం పట్టీలు, టానిక్లు తల్లి రక్తహీనతను తగ్గించి, సుఖ ప్రసవం జరగడానికి ఉపయోగపడతాయని చెప్పారు. పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటేనే రాష్ట్రం, దేశం బలంగా ఉంటుందనేది సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. కడుపులో బిడ్డ పడగానే అందించేది న్యూట్రిషన్ కిట్ అయితే కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్ ని అన్నారు. బీపీ, షుగర్తో బాధపడుతున్న రాష్ట్రంలోని 15 లక్షల మందిని గుర్తించి ఎన్సీడీ కిట్స్ అందిస్తున్నట్టు తెలిపారు. పైలేరియా రోగులకు కూడా పైలేరియా కిట్స్ సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఇలా ప్రజలకు కావాల్సినవన్నీ కిట్ల రూపంలో మన సీఎం అందిస్తుంటే.. ప్రతిపక్షాలు తిట్లలో కాలం గడుపుతున్నాయని విమర్శించారు. మనవేమో కిట్లు, ప్రతిపక్షాలవేమో తిట్లు అని పేర్కొన్నారు.
కంటివెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్దదని, అది సీఎం కేసీఆర్ ఆలోచన నుంచే పుట్టిందని హరీశ్రావు తెలిపారు. నేడు పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలు కూడా కంటి వెలుగును తమ రాష్ర్టాల్లో కూడా నిర్వహిస్తామనడం మన రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలు మనల్ని చూసి నేర్చుకునేంత గొప్పగా సీఎం కేసీఆర్ పాలన ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో కరెంటు వెలుగులు, కంటి వెలుగులు అందిస్తే.. గతంలో ఉన్న కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కందిళ్లు ఉండేవని, బడ్జెట్ సమావేశాల్లో కందిళ్లు పట్టుకుని వెళ్లే పరిస్థితులు ఉండేవని చెప్పారు.
రోగమొస్తే బాగు చేయడమే కాదు, రోగం రాకుండా కూడా ఆలోచించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు అన్నారు. మిషన్ భగీరథతో తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని, రాష్ట్రంలో ఫ్లోరైడే లేదని కేంద్రం స్వయంగా పార్లమెంట్లో చెప్పిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడకుండా, అంటురోగాలు రాకుండా, స్వచ్ఛమైన శుద్ధిచేసిన తాగునీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్ది అని పేర్కొన్నారు. ‘గతంలో వర్షాకాలం వచ్చిందంటే టీవీల్లో మన్యం మంటగలిసిందని, పంటలన్నీ పడకేశాయని, హుటాహుటిన హైదరాబాద్ నుంచి వైద్యబృందాలు, ఆరోగ్య మంత్రి బయలుదేరారని, సీఎం రివ్యూ చేశారని వార్తలు రోజూ కనిపించేవి. కానీ గత మూడునాలుగేండ్లుగా రాష్ట్రంలోని మారుమూల గిరిజన గోండు గూడేల్లోగానీ, లంబాడా తండాల్లోగానీ ఎక్కడా అంటురోగాలు లేవు. సీజనల్ వ్యాధులు మటుమాయమైనవంటే కారణం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ వంటి గొప్ప కార్యక్రమాలే. మిషన్ కాకతీయ ద్వారా మట్టిలో ఉన్న ఫ్లోరైడ్ శాతాన్ని కూడా తగ్గించగలిగామని చెప్పారు. రాష్ట్రంలో గత 9 ఏండ్లలో 7.4 శాతం అడవులను పెంచి.. అడవులు వృద్ధిలో నంబర్ వన్గా నిలిచామని చెప్పారు. ప్రజలకు రోగాలు వస్తే బాగు చేయడమే కాదు, రోగాలు రాకుండా ప్రజలను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ రోజు మెడికల్ కాలేజీల్లో తెలంగాణ నంబర్ వన్గా ఉందని, ప్రతి లక్ష మంది జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో మొదటి స్థానంలో నిలిచిందని హరీశ్రావు తెలిపారు. పీజీ మెడికల్లో లక్షకు ఏడున్నర సీట్లతో దేశంలో రెండో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. ‘తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ వన్. తలసరి విద్యుత్తు వినియోగంలో నంబర్ వన్, గ్రీన్ కవర్ పెరుగుదలలో నంబర్ వన్, ఎంబీబీఎస్ సీట్లలో నంబర్ వన్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటది. సీఎం కేసీఆర్ నంబర్ వన్ కనుకనే రాష్ట్రం ప్రతి రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నది’ అని వెల్లడించారు. తెలంగాణ వైద్యరంగంలో కొనసాగుతున్న విప్లవంలో తనకు పనిచేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ నేతలు కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, సునితా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
గతంలో వైద్య విద్య సామాన్యులకు అందని ద్రాక్షగా ఉండేదని, వైద్య విద్య అభ్యసించేందుకు కొందరు ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లేవారని మంత్రి హరీశ్రావు తెలిపారు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన పిల్లలు వైద్యవిద్య కోసం ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేకుండా జిల్లాకు ఒకటి చొప్పున 33 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రం వచ్చినప్పుడు 2,850 ఎంబీబీఎస్ సీట్లుంటే, సీఎం కేసీఆర్ విజన్తో నేడు అవి 8,340కి పెరిగాయని వెల్లడించారు. వచ్చే సంవత్సరం మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాబోతున్నట్టు చెప్పారు. ములుగు, ఆసిఫాబాద్, కుమ్రంభీమ్ వంటి మారుమూల జిల్లాలకు కూడా మెడికల్ కాలేజీలు రావడం కలలో కూడా ఊహించలేదని అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్, పారామెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్టు తెలిపారు.