కోటగిరి/వర్ని, ఏప్రిల్ 4: పాడి రైతులకు ఎట్టకేలకు గురువారం పాల బిల్లు లు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాల బిల్లులు నిలిచిపోయాయి. సుమారు రూ.80 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో 45 రోజులపాటు బిల్లులు రాక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆగ్రహించిన రైతులు బుధవారం నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఆందోళనకు దిగారు. పశువులకు దాణా కొనుగోలుకు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘పాడిరైతులకు పైసల్లేవు-విజయ డెయిరీ 80 కోట్ల బకాయి’ శీర్షికన గురువారం వార్తను ప్రచురించింది. దీంతో ప్రభుత్వం వెం టనే స్పందించి కొంత మేర బిల్లులను విడుదల చేసింది. మొత్తం బకాయిలు చెల్లించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్ని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం పరిధిలో 220 మంది రైతులకు విజయ డెయిరీకి పాలు పోస్తుండగా.. రూ.23 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. వారికి గురువారం రూ.8 లక్షలు మాత్రమే విడుదల చేశారు. మిగతా డబ్బులను కూడా వెంటనే చెల్లించాలని సంఘం అధ్యక్షుడు పెనుమర్తి దేవరాజు డిమాండ్ చేశారు. కోటగిరి మండలానికి సంబంధించి సుమారు రూ.6 లక్షలు రావాల్సి ఉండగా.. రూ.1.59 లక్షలు మాత్రమే మంజూరయ్యాయని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు దమ్మలపాడి ఉదయ్ తెలిపారు. వీలైనంత తొందరగా మిగతా బకాయిలను కూడా చెల్లించాలని విజ్ఙప్తి చేశారు.