హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ అంతే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. సుమారు రూ.5,600 కోట్లతో ఉద్దండాపూర్ దిగువన కరివెన, నారాయణపేట, వికారాబాద్లో దాదాపు 1100 చెరువులను నింపి తాగునీటిని సరఫరా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ తాజాగా ఆమోదం తెలిపారు. మొదటి దశలో తాగునీటికి సంబంధించిన పనులను, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని సంకల్పించింది. ఇప్పటికే తొలిదశకు సంబంధించిన తాగునీటి పనులు పూర్తికావచ్చాయి. రిజర్వాయర్లు సైతం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో తాగునీటి కోసం ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి చెరువులను నింపేందుకు తాగునీటి కాలువల పనులు చేపట్టాల్సి ఉన్నది.
నేడు పాలమూరుపై తొలి సమీక్ష
నూతనంగా నిర్మించిన సచివాలయంలో సోమవారం ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సమీక్షను నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపై సాగునీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. సీఎం సమావేశ మందిరంలో మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. సమీక్షలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యదర్శి స్మితాసబర్వా ల్, ఇరిగేషన్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, చీఫ్ ఇంజినీర్లు పాల్గొననున్నారు.
సీఎంకు ఎంపీ రంజిత్రెడ్డి కృతజ్ఞతలు
ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫైలు పై సీఎం కేసీఆర్ సంతకం చేయటంపై చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాలకు తాగునీటితోపాటు, సాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టుపైన నూతన సెక్రటేరియట్లో తొలి సమీక్ష నిర్వహించనుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు రంగారెడ్డి జిల్లా ప్రజలందరి తరఫునన ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.