ఇప్పటికే 60% పెంచిన కేంద్రం
రష్యా- ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో మరింత భారం
కొరత తప్పదన్న అంచనాలు
వానకాలంలో రాష్ట్ర అవసరం 24.45 లక్షల టన్నులు
1.42 కోట్ల ఎకరాల్లో సాగు
వానకాలం ప్రణాళికను ఖరారు చేసిన వ్యవసాయశాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న వానకాలం సీజన్లో ఎరువుల ధరలు రైతన్నలకు పట్టపగలే చుక్కలు చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత రైతులకు షరాఘాతంలా తగిలే సూచనలు గోచరిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే అన్నదాతలపై విపరీతమైన భారం పడింది. దానికి తోడు కేంద్రప్రభుత్వం ఎరువుల ధరలను 60 శాతం పెంచేందుకు అనుమతివ్వటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్టుగా ఈ పరిస్థితులకు తోడు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మన దేశ అన్నదాతలకు పెను సమస్యలు తెచ్చిపెట్టనున్నదని వ్యవసాయార్థికవేత్తలు పేర్కొంటున్నారు.
భారీగా పెరుగనున్న ధరలు
మన దేశంలో విరివిగా వాడే యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ధరలపై ఉన్న సబ్సిడీలను క్రమంగా వదిలించుకొంటున్న కేంద్ర ప్రభుత్వం, వాటి ధరలను 60 శాతం పెంచేందుకు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. అయినా ఇప్పుడు సరిపడా ఎరువులు దొరికే పరిస్థితి కనిపించటంలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో విదేశాల్లో ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి. మన దేశానికి దిగుమతులు తగ్గాయి. ఇది దేశంలో ఎరువుల లభ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. వానకాలం సీజన్ కోసం ప్రస్తుతం దేశంలో 10 శాతం ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీన్నిబట్టి ఎక్కువ ధరకు కొందామన్నా ఎరువులు దొరకని పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుండగా, కొరత భయాలతో వారికి నిద్ర కరువయ్యే పరిస్థితి ఉన్నది.
ముడి సరుకుల ధరలు పెరగడం, దిగుమతులు తగ్గడంతో దేశంలో ఎరువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రైతులపై పెను భారం పడటంతోపాటు, వ్యవసాయ దిగుబడులపై కూడా ప్రభావం చూపుతుంది. ఎరువుల కొరతపై దేశమంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. వ్యవసాయ సీజన్ కోసం రెండు నెలల ముందే అన్నిరకాలుగా సంసిద్ధం కావాల్సి ఉన్నా, బీజేపీ సర్కారులో ఇప్పటికీ చలనం కనిపించటం లేదని విమర్శిస్తున్నారు.
రాష్ర్టానికి 24 లక్షల టన్నులు అవసరం
వచ్చే వానకాలం సీజన్కు సంబంధించిఎరువుల ప్రణాళికను రాష్ట్ర వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. సీజన్లో మొత్తానికి 24.45 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేసింది. యూరియా 10.50 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 9.40 లక్షల టన్నులు, డీఏపీ 2.30 లక్షల టన్నులు, ఇతర ఎరువులు 2.25 లక్షల టన్నులు అవసరం ఉంటుందని నిర్ధారించింది. వానకాలంలో 1.42 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు వేసేలా వ్యవసాయశాఖ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇందులో అత్యధికంగా పత్తి 70-75 లక్షల ఎకరాల్లో, వరి 50 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని నిర్ణయించింది. ఈ వానకాలం కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ విభాగం చెప్పటంతో అంచనాలకు మించి పంటలు సాగయ్యే అవకాశం ఉన్నదని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు ప్రారంభించింది. సీజన్కు ముందుగానే ఎంత ఎరువులు అవసరమన్నది అంచనా వేసి కేంద్రానికి నివేదించనున్నది.