హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు శాపంగా మారుతున్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు పదేపదే కేంద్రమే ధాన్యం సేకరిస్తున్నదని, అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తున్నదని ప్రచారం చేయడం వాస్తవ పరిస్థితులను వక్రీకరించడం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. రైతుల సమస్యలను ఒక వరి ధాన్యానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదని పేర్కొన్నారు.
కేంద్రం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న పెసలు, కందులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి పంటలపై 25% పరిమితి విధించడం వల్ల మిగిలిన పంటను రైతులు ఎకడ విక్రయించాలనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా తెలంగాణలో విస్తృతంగా సాగు చేస్తున్న మక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పథకం పరిధిలోకి ఎందుకు తీసుకొనిరావడం లేదో స్పష్టం చేయాలని కోరారు. గత ఐదేండ్లలో డీఏపీ ధరలు 70%, కాంప్లెక్స్ ఎరువులు 60%, డీజిల్ ధరలు 40%, వరకు పెరిగినా, మద్దతు ధరల పెరుగుదల మాత్రం వరిపై 27%, మక్కజొన్నపై 20%, ఉన్నదని చెప్పారు.