హనుమకొండ, జూలై 12 : రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ హరిత హోటల్లో నిర్వహించిన సమావేశంలో విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చిన స్పందన లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ సుధీర్కుమార్, జన్ను జకారియా, మంద కుమార్ మాదిగ, కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుణహరి శేషు, సీపీఐ జిల్లా నేత రాజమౌళి పాల్గొన్నారు.