స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు దేశంలో పేదరికం, ప్రజల కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకొని అనేక రంగాలకు భారీగా సబ్సిడీలు ఇస్తూ పేద ప్రజలకు, రైతులకు, చిన్న పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటున్నాయి. ఇందులో భాగంగా ఇంధన రంగం (వంటగ్యాస్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్) అలాగే విద్యుత్తు, ఎరువులు, ఆహార రంగాలకు దశాబ్దాలుగా సబ్సిడీలు ఇస్తూ వచ్చాయి. కేంద్రంలోకి బీజేపీ వచ్చాక ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది. అన్ని రంగాలు కోలుకోనంతగా దెబ్బతిన్నాయి. దేశం లక్షల కోట్ల అప్పుల పాలైంది.
దేశ బడ్జెట్లో సింహభాగం అప్పుల చెల్లింపునకే పోతున్నది. క్యాపిటల్ పెట్టుబడి కనిష్ఠ స్థాయిని కూడా దాటడం లేదు. దీనితో కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ‘లాభాలుంటే అమ్మేయ్.. నష్టాలొస్తే మూసేయ్’ అనే విధానం తీసుకుంది. ఇంధనం, విద్యుత్తు, ఎరువులు, ఆహారం మీద సబ్సిడీలను విడతలవారీగా ఎత్తివేస్తూ వస్తున్నది. ఇంధనం మీద ఇప్పటికే వంతులవారీగా సబ్సిడీలు ఎత్తేసింది. గ్యాస్ ధరను మూడింతలు చేసి సబ్సిడీలకు మంగళం పాడింది. ఆ తర్వాత ఎరువుల మీద పడి క్రమంగా ఎరువుల సబ్సిడీ తగ్గిస్తూ వస్తున్నది. విద్యుత్తు రంగంలో సంస్కరణల పేరిట ఉచిత విద్యుత్తును, విద్యుత్తు సబ్సిడీలను ఎత్తివేసే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించింది. ఎఫ్ఆర్బీఎం పరిమితితో ముడిపెట్టి ఇప్పటికే ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో, నెల్లూరులో ఒక మండలంలో సబ్సిడీల ఎత్తివేతను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. పంజాబ్లో నేరుగా విద్యుత్ మీటర్లే అమర్చింది. తర్వాత తమ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్లో అమలుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇపుడు ఆహార ధాన్యాల సబ్సిడీ మీద పడింది. ఇందులో భాగంగా 2015 నుంచి కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్, పుదుచ్చేరిలో 2016 నుంచి దాద్రానాగర్ హవేలీలో రేషన్ షాపుల్లో ఆహార పదార్థాల పంపిణీకి బదులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతి తీసుకువచ్చింది. అంటే నగదు బదిలీ పథకం. అంటే రేషన్ షాపుల్లో ధరలకు- బహిరంగ మార్కెట్ ధరలకు మధ్య ఉండే తేడాకు సరిపడా డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లో నగదు రూపంలో వేయడం. క్రమంగా సబ్సిడీలు ఎత్తేయడంలో ఇదొక భాగమనే అంతా అనుమానిస్తున్నారు.
ఈ పరంపరలో భాగంగానే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఎయిర్ ఇండియా తదితర సంస్థలను అమ్మకానికి పెట్టినట్టే నష్టాల సాకుతో ఎఫ్సీఐని కూడా మూసే అవకాశమున్నది. ఈ క్రమంలోనే ముందుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం ధాన్యాన్ని సేకరణ నుంచి మినహాయించి బాధ్యతను వదిలించుకోవడం. అలా ఏటికేడు వాటి సంఖ్య పెంచుతూ పోయి క్రమంగా కొనుగోళ్లను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం దీని వెనక ఉద్దేశం. లేకపోతే తెలంగాణలో అవకాశం లేదని తెలిసీ రా రైస్ ఎంతైనా కొంటామంటున్న కేంద్రమే చత్తీస్గఢ్లో రా రైస్ కు కోత పెడుతుండటం దీనికి నిదర్శనం.
అసలు ఎఫ్సీఐని మోయడం కేంద్రానికి ఇష్టం లేదు. ఆహార భద్రత పేరిట ఇంత సొమ్ము వెచ్చించడం అసలే ఇష్టం లేదు. వాస్తవానికి కనీస మద్దతు ధర చెల్లించి ఎఫ్సీఐ కొన్న ధరకు బహిరంగ మార్కెట్లో అమ్మే ధరకు మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎప్సీఐకి చెల్లించాలి. గత నాలుగైదేండ్లుగా కేంద్రం ఆ పని చేయడం లేదు. పైగా బయట సంస్థల వద్ద అప్పులు తెచ్చుకోవాలని ఎఫ్సీఐకి సూచిస్తున్నది. ఇలా కేంద్రం సబ్సిడీని బిగబట్టడంతో ఎఫ్సీఐ అప్పుల ఊబిలో చిక్కుకున్నది. దానికితోడు నిర్వహణ లోపాల వల్ల ముందుచూపు లేకపోవడం వల్ల ఎఫ్సీఐ ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి 47,339 కోట్ల అప్పుల్లో ఉన్నది. మరోవైపు దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నానాటికీ పెరుగుతున్నది. రానున్న కాలంలో కనీస మద్దతు ధాన్య సేకరణ మీద భారీగా వెచ్చించాల్సి వస్తుంది. అందువల్ల దీన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవాలని అందులో భాగంగా ధాన్యం కొనుగోళ్ల నుంచి తాను తప్పుకొని పైవేటు రంగానికి ధారాదత్తం చేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తున్నది.