హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్సీఐ) తన మొండివైఖరిని వీడటం లేదు. ఇక్కడి రైతుల పరిస్థితిని, తెలంగాణ ప్రత్యేక వాతావరణాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఓ ప్రైవేటు సంస్థలా వ్యవహరిస్తున్నది. ‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్న చందంగా ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు వడ్లను కొనుగోలు చేయబోమని మొండికేస్తున్నది. తాము సన్న వడ్లు తప్ప దొడ్డు వడ్లు కొనే ప్రసక్తే లేదని ఎఫ్సీఐ తెలంగాణ రీజియన్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ మరోసారి తేల్చిచెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బుధవారం జరిగిన సమావేశంలో ఎఫ్సీఐ వైఖరిని వెల్లడించారు. ఇంతకుముందు.. వచ్చే యాసంగిలో దొడ్డు వడ్లు కొనబోమని చెప్పిన ఎఫ్సీఐ ఇప్పుడు వానకాలంలో కూడా దొడ్డు వడ్లు కొనబోమని అంటున్నది. దీంతో ఇప్పటికే సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి సాగుచేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ వానకాలంలో సుమారు కోటి నుంచి రూ.1.20 కోట్ల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండగా తాము 60 లక్షల టన్నుల సన్నాలను మాత్రమే కొనుగోలు చేస్తామని దీపక్శర్మ స్పష్టం చేశారు. ఈ సీజన్లో రైతులు అధికశాతం దొడ్డు ధాన్యమే సాగుచేశారు. గత వానకాలంలో ఎఫ్సీఐ అతికష్టం మీద 48.85 లక్షల టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ సీజన్తోపాటు భవిష్యత్లో కూడా దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పిన ఎఫ్సీఐ.. రైతులను వరి పంట సాగుకు దూరంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే సన్న రకాలను మాత్రమే సాగుచేయాలని పిలుపునిచ్చింది. రైతులకు ఆ దిశగా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఆందోళనలో రైతాంగం
దొడ్డు వడ్లు కొనకూడదన్న ఎఫ్సీఐ నిర్ణయం తెలంగాణ రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. రైతుకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం అన్నదాతను ఇలా ఇబ్బంది పెట్టడంపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొడ్డు వడ్లు వద్దంటున్న కేంద్రం.. మరి సన్నాలకు ఏమైనా అధిక ధర ఇస్తుందా..? అంటే అదీ లేదు. ఎఫ్సీఐ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరికి తెలంగాణ రైతాంగం బలయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఇటీవలే మంత్రులు కే తారకరామారావు, గంగుల కమలాకర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎఫ్సీఐ చైర్మన్ను కలిసి దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తిచేశారు. అయినప్పటికీ వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఎఫ్సీఐ వైఖరి మార్చుకోవాలి: గంగుల
దొడ్డు వడ్లు కొనబోమంటూ ఎఫ్సీఐ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎఫ్సీఐ తన వైఖరిని మా ర్చుకోవాలి. ఒక్కసారిగా ధాన్యం కొనుగోలు చేయలేమంటే దీనివల్ల రైతులకు తీరని నష్టం జరుగుతుంది. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. అలాంటి వాళ్లను మళ్లీ ఇ బ్బందుల్లోకి నెట్టేలా ఎఫ్సీఐ చర్యలు ఉండొద్దు.
దొడ్డు వడ్లను కేంద్రమే కొనాలి: ఓసీ జేఏసీ నేత పోలాడి రామారావు
హనుమకొండ, సెప్టెంబర్ 8: రైతులు పండించిన దొడ్డు రకం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నాయకుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దొడ్డు రకాల ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రం హఠాత్తుగా ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్ర రైతాంగానికి కోలుకోలేని దెబ్బ అని అన్నారు. ఇప్పటికే రైతు వ్యతిరేక సాగు చట్టాలను తెచ్చిన కేంద్రం ఇప్పుడు దొడ్డు రకాలను కొనుగోలు చేయలేమని ప్రకటించడం బాధాకరమన్నారు. ముఖ్యంగా దేశంలోనే దొడ్డు రకాలు ఎక్కువగా పండించే తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచడమేనన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న కేంద్ర పెద్దలు అన్నదాతలపై ఎందుకు నిర్లక్ష్యం, వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు.