హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో వరికి బదులుగా ఇతర పంటల సాగువైపు మళ్లుతున్నారు. దీంతో గత యాసంగి సీజన్తో పోలిస్తే ఈసారి వేరుశనగ, పొద్దుతిరుగుడు, మక్కజొన్న, గోధుమ, పొగాకు, నూనెగింజల సాగు అధికమైంది. రాష్ట్రంలో ఈ నెల మూడో వారం చివరినాటికి రైతులు 10,27,928 ఎకరాల్లో పంటల సాగు చేపట్టినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్ర రైతులు 7,66,574 ఎకరాల్లో పంటలు వేశారని, ఈసారి సాగు విస్తీర్ణం 2.61 లక్షల ఎకరాలు పెరిగిందని బుధవారం విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. వీటిలో 3,86,008 ఎకరాల్లో పప్పుధాన్యాలు, 3,35,784 ఎకరాల్లో నూనెగింజలు, 2,54,212 ఎకరాల్లో మక్కజొన్న, జొన్న, రాగి, ఎర్రజొన్నలు, ఇతర చిరుధాన్యాలు, 44,589 ఎకరాల్లో వరి, గోధుమ, 44,124 ఎకరాల్లో గడ్డి, గ్రీన్మెన్యూర్, 7,800 ఎకరాల్లో ఇతర వాణిజ్య పంటలు వేసినట్టు వివరించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వరిసాగు భారీస్థాయిలో 91,358 ఎకరాలు తగ్గినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది.