హైదరాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. కొరతను దాచేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన యాప్ రెండు రోజులుగా మొరాయిస్తుండటంతో యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారు. మొన్నటివరకు స్టేట్ యాప్తో అష్టకష్టాలు పడగా, ఇప్పుడు సెంట్రల్ యాప్ కూడా పనిచేయకపోవడంతో రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. ఇప్పుడు యూరియా, దుక్కి మందు, అమ్మోనియా అన్నీ సెంట్రల్ యాప్లోనే అంటూ కొత్త యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తుండటంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఇటు కేంద్రం తీసుకొచ్చిన యాప్, అటు రాష్ట్రం అమలుచేస్తున్న యాప్ రెండింటీ పరిస్థితి ఒకేలా ఉండటం గమనార్హం. ఇప్పటికే కేంద్రం యాప్ను 10 జిల్లాల్లో అమలుచేస్తున్నారు.
ఈ నెల 20నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాల్సి ఉన్నది. కానీ యాప్ పనిచేయక, అందుకు సంబంధించిన లింక్ రాక అమలు ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కేంద్రం యాప్ వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర యాప్ను పక్కనపెట్టారు. ఇప్పుడు కేంద్ర యాప్ రాకపోవడంతో రాష్ట్రం యాప్లో యూరియా బుక్ చేద్దామం టే అది కూడా పనిచేయకపోవడం గమనార్హం. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఓవైపు యాప్లు పనిచేయక, మరోవైపు మాన్యువల్గా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు నానాతంటాలు పడుతున్నారు. ఈ విషయాన్ని డీలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే ఎవరూ దీనిపై స్పందించడం లేదని, ఇటు అధికారులు, అటు టెక్నికల్ సిబ్బంది చేతులెత్తేశారని తెలిసింది.
ఎల్లారెడ్డిపేట/ గంభీరావుపేట ఆగస్టు 25 : యూరియా యాప్ ఓపెన్ కాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి చేరుకొని గంటల తరబడి నిరీక్షించి అధికారుల తీరుపై మండిపడ్డారు. గంభీరావుపేట మండలంలోని మూడు సింగిల్ విండో గోదాముల్లో యూరియా బస్తాలు అందుబాటులో ఉంటాయని అధికారులు సమాచారం ఇవ్వడంతో రైతులు ఉదయం 11గంటలకు ఫోన్లు చేతపట్టుకొని సిద్ధమయ్యారు. తీరా రెండు గంటల పాటు శ్రమించినా సర్వర్ సమస్య కారణంగా సమయానికి యూరియా బుక్ కాకపోవడంతో నిరసన తెలిపారు.