సిరికొండ, మే 1 : ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లు కోసి 25 రోజులైనా కొనుగోలు చేయడంలేదని జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తరలించినా కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
దొడ్డు రకం ధాన్యాన్ని మిల్లులకు తరలించి ఆరు రోజులైనా అన్లోడ్ చేసుకుంటలేరని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. నిజామాబాద్ రైస్ మిల్లులకు తరలించినా వడ్లను తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే క్వింటాల్కు 11కిలోల కడ్తా అడుగుతున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డిపేట, మే 1: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఐకేపీ కేంద్రంలో అదనంగా తూకం వేస్తేనే కొనుగోలు చేస్తామని మిల్లర్లు మెలికపెట్టడంపై రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. ఓ వైపు ఎండలు మండిపోతుండటం, నెల రోజుల కింద తెచ్చిన ధాన్యం తేమశాతం వచ్చినా కొనేవారు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

రెండు రోజులుగా కొనుగోలు నిలిచిపోవడంపై మండిపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం నష్టమని తెలిసినా బస్తాకు 42.200 కిలోలు తూకం వేసినా.. వినకుండా 42.500 కిలోలు పెట్టాలని ఓ మిల్లు యజమాని కొర్రీ పెట్టడంతో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నిరసనలో సర్పంచ్ ఎన్గందుల నర్సింలు, నాయకులు రాగుల ఎల్లారెడ్డి, సంజీవ్రెడ్డి, బందారపు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.