హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజే పీ వివక్ష భరింపరానంతగా పెరుగుతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం చేపట్టే ప్రతి పనిని కేంద్రం అడ్డుకొంటున్నదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ‘చేపల కల్లాలకు నిధులు ఇస్తరెట్ల? రైతు కల్లాలకు ఇయ్యరెట్ల? అని మోదీ సర్కారును ప్రశ్నించారు. గురువారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్కుమార్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులంటే మోదీకి కండ్ల మంట ఎందుకని నిలదీశారు. రైతు కల్లాల కోసం ఖర్చుచేసిన 151 కోట్ల నిధులను వాపస్ ఇవ్వాలని కేంద్రం రాష్ర్టానికి లేఖ రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
చేపల కల్లాలకు ఎందుకు ఇచ్చారు..
రైతుల కోసం కల్లాలు నిర్మించటం తప్పు అని కేంద్రం పేర్కొనటాన్ని హరీశ్రావు ఆక్షేపించారు. ‘రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం కల్లాలు నిర్మించింది. అది తప్పు అని కేంద్రంలోని బీజేపీ అంటున్నది. కల్లాలు నిర్మించిన నిధులు 151 కోట్లు వాపస్ ఇవ్వాలని లేఖ రాసింది. కల్లం నిర్మించకుండా బిల్లు పెడితే తప్పు కానీ, కల్లాలు నిర్మిస్తే ఎట్లా తప్పవుతుంది? చేపలు ఎండబెట్టుకోవటానికి కల్లాలు నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రైతులు కష్టపడి పండించిన పంటను ఆరబెట్టుకోవటానికి కల్లా లు కట్టుకొంటే తప్పు అంటున్నది. రైతులపై కేంద్రానికి ఇంత వివక్ష ఎందుకు? చేపల కల్లాలకు నిధులు ఇస్తరెట్ల? రైతు కల్లాలకు ఇయ్యరెట్ల? ఇదేంద్వంద్వ నీతి? అని మండిపడ్డారు.
కేంద్రం ప్రతీ నిర్ణయం రైతు వ్యతిరేకమే
కేంద్రంతీసుకొనే ప్రతీ నిర్ణయం రైతు వ్యతిరేకమేనని హరీశ్ విమర్శించారు. ‘మ్యానిఫెస్టోలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీఇచ్చి, పెట్టుబడిని రెట్టింపు చేసిన ఘనత బీజేపీదేనని ఎద్దేవా చేశారు. గతంలో ట్రాక్టర్తో పొలం దున్నటానికి ఎకరానికి రూ.2 వేలు ఖర్చయ్యేది. మోదీ సర్కారు డీజిల్ ధరలు పెంచటం వల్ల అదిప్పుడు రూ.5 వేలు అయ్యిం ది. ఎరువుల ధరలు విపరీతంగా పెంచింది. మరోవైపు వడ్లు కొనమంటే నూకలు బుక్కండి అని ఎగతాళి చేస్తున్నారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలను పొట్టన బెట్టుకున్న చరిత్ర బీజేపీది’ అని మండిపడ్డారు.
ఉపాధి కూలీలనూ వదలని కేంద్రం
రైతులనే కాదు.. ఉపాధి కూలీలనూ మోదీ సర్కారు వదలటం లేదని హరీశ్ మండిపడ్డారు. ‘ఉపాధి కూలీలకు ఎండాకాలంలో పని ప్రదేశాల్లో టెంట్ వేసి, మంచినీళ్ల సౌకర్యం కల్పించి, ఫస్ట్ ఎయిడ్ కిట్ను ఏర్పాటు చేస్తాం. వాటిని కేంద్రం తాజాగా రద్దు చేసింది. సాఫ్ట్వేర్ మార్పుతో అదనపు కూలీని ఇవ్వకుండా ఎగ్గొట్టిన దుర్మార్గపాలన బీజేపీది. మూడు పూటలా ఉపాధిహామీ వర్క్సైట్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తేనే కూలీ ఇస్తామని మెలిక పెట్ట డం దారుణం. రాష్ట్రంలో రూ.50 కోట్ల పనిదినాలకు కేంద్రం నుంచి వేతనాలు రావాలి. అవి ఎప్పుడిస్తారు?’ అని ప్రశ్నించారు.
ఇక పోరుబాటే..
కేంద్ర రైతు వ్యతిరేక నిర్ణయాన్ని ఎండగడుతూ శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడుతున్నామని హరీశ్రావు చెప్పారు. కల్లాలు కట్టడాన్ని తప్పుబట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఆ రూ.30 వేల కోట్లేవి?
బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టడానికి నిరాకరించినందుకు కేంద్రం రాష్ర్టానికి రావాల్సిన 30 వేల కోట్లు నిధులను ఆపిందని హరీశ్ విమర్శించారు. ఏటా 5 వేల కోట్లచొప్పున, ఐదేండ్లలో 30 వేల కోట్లు ఆపేసిందని తెలిపారు. మోటర్లకు మీటర్లు పెట్టే ముచ్చటే లేదని చెప్తున్న బీజేపీ నాయకులు, కేంద్రం ఆపిన ఆ 30 వేల కోట్ల సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. కల్లాలు నిర్మించొద్దని కేంద్రం రాసిన లేఖపై బీజీపీ నేతలు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.
రైతులందరూ పాల్గొనాలి
కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాలో రైతులు, సామాన్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. రైతు కల్లాల నిర్మాణం పూర్తయ్యాక కేంద్రం నిధులు తిరిగి ఇవ్వాలని కోరడం సరికాదు. వెంటనే ఆ నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కేంద్రం 80 శాతం ఉన్న రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో వ్యవహరిస్తూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. కేంద్రం అవలంబిస్తున్న రైతు, కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం చేపట్టే ధర్నాలను జయప్రదం చేయాలి.
– మంత్రి కొప్పుల ఈశ్వర్
కేంద్రం తీరు సరికాదు
కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు, ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయ కల్లాలకు వినియోగించిన ఉపాధి నిధులు తిరిగి ఇవ్వమనడం సరికాదు. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. శుక్రవారం నిర్మల్ పట్టణంలో నిర్వహించే ధర్నాలో నేను పాల్గొంటారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ వివక్ష చూపుతున్నది.
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
కేంద్రంలో బీజేపీ ఉండటం దౌర్భాగ్యం
వ్యవసాయంపై కనీస అవగాహన లేని ప్రధాని, కేంద్రమంత్రులు దేశాన్ని పాలిస్తుండటం దేశ ప్రజల దౌర్భాగ్యం. ఇతర రాష్ర్టాల్లో చేప ల కల్లాల నిర్మాణానికి అభ్యంతరం చెప్పని మోదీ ప్రభుత్వం..తెలంగాణ కల్లాలకు నిధులివ్వకపోవడం రాష్ట్రంపై కక్షపూరిత ధోరణికి నిదర్శనం. శుక్రవారం జిల్లా కేంద్రాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టి కేంద్రానికి గుణపాఠం చెప్పాలి.
– మంత్రి సత్యవతి రాథోడ్
కేంద్రం కక్షసాధింపు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గ్రామాలకు, పేదలకు ఉపయోగడుతున్న ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నది. మోదీ ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే విధానాలను అమలు చేస్తున్నారు. రైతుల పంట కల్లాల నిర్మాణంలో అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలకు రైతులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలి.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు