వరంగల్ : వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వానాకాలం ధాన్యం సేకరణకు చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు డా.బి.గోపి, రాజీవ్గాంధి హనుమంతు, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష చేశారు.
ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత సీజన్లో ఎదురైన అనుభవాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని రీతిలో రైతులు పండించిన పంటలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోళ్లు చేపడుతుందన్నారు.
ధాన్యం సేకరణలో కేంద్రం ప్రభత్వం నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నా.. రైతుల కోసం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధాన్యం సేకరిస్తుందన్నారు. వరంగల్ జిల్లాలో 180, హనుమకొండ జిల్లాలో 150 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన తాగునీరు, శామియానాలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.
ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ప్రతిరోజు సమీక్ష జరపాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులు అమ్మకాల కోసం కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించకుండా వరికోత సమయాన్ని అనుసరించి టోకెన్ లు అందజేసి, కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ధాన్యం సేకరణ పూర్తి అయ్యేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.