సూర్యాపేట : కాంగ్రెస్ పాలనలో అప్పుడే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ పార్టీ గెలిచాక తన మార్క్ రాజకీయాలను మొదలు పెట్టింది. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి బీఆర్ఎస్ను తిట్టడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. సాగు, తాగు నీరులేక ప్రజలు అల్లాడుతుంటే తమాషాలు చేస్తున్నారు. తాజాగా
ఎస్సారెస్పీ(SRSP) నీళ్లు రాక తమ పొలాలు ఎండిపోతున్నాయని కడుపుమండిన రైతులు రోడ్డెక్కారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని కోట పహాడ్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే ఎస్సారెస్పీ ద్వారా నీటిని విడుదల చేయాలని రహదారిపై రాస్తారోకో (Farmers protested)నిర్వహించారు.
గత పదేండ్ల కాలంలో సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు పండిచామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, సాగు నీటి కష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీళ్లు అందించి పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.