తల్లాడ/లక్ష్మీదేవిపల్లి/టేకులపల్లి, జూలై 25 : యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఉదయాన్నే సొసైటీ కార్యాలయానికి సుమారు 400మంది రైతులు చేరుకున్నారు. తల్లాడ సొసైటీకి లారీలో 200 కట్టలు మాత్రమే వచ్చాయని, వాటిని మాత్రమే పంచుతామని, మిగిలిన 200 కట్టలను వేరేచోటుకు తరలించనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆగ్రహించిన రైతులు లారీ వెళ్లకుండా అడ్డుకున్నారు. 200 బస్తాలు సరిపోవని లారీలో ఉన్న మొత్తం 400 బస్తాలు ఇక్కడే దింపాలని బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఏవో తాజుద్దీన్ అక్కడికి చేరుకొని లోడ్ మొత్తం అక్కడే దింపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆధార్కార్డు, రైతుపట్టా పాస్పుస్తకం ఉన్న రైతులకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. కౌలు రైతులకు ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చిచెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని బేతంపూడి పీఏసీఎస్ వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు. ఎరువుల కోసం ఎగబడటం, క్యూ కట్టడం చూస్తుంటే పాతరోజులు గుర్తుకొసున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం ఎన్నడూ ఇలా కష్టాలు పడలేదని రైతులు పేర్కొన్నారు. కాగా లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోడౌన్ వద్దకు రైతులు శుక్రవారం ఉదయం 6గంటలకే చేరుకున్నారు. అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడంతో బంగారుచెలక, తోకబందాల, మైలారం, గట్టుమల్ల గిరిజన గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున ఎరువులు అందించాల్సి ఉండగా రెండు బస్తాలే ఇచ్చినట్టు రైతులు వాపోయారు. డీఏపీ తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారని, 20-20 ఎరువు స్టాక్ లేదని వారు పేర్కొన్నారు.