Paddy Procurement | సిద్దిపేట, ఏప్రిల్ 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి): నానా కష్టాల నడుమ యాసంగి పంట పండించి.. తీరా వడ్లను అమ్ముకుందామంటే రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా వాటిలో కనీస సౌకర్యాలు లేవు. ఓ వైపు చెడగొట్టు వానలు దడపుట్టిస్తున్నా.. నత్తకే నడక నేర్పేలా సాగుతున్న కొనుగోళ్లతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏ గాలివానో వచ్చి పంట కొట్టుకుపోతే ఎట్లా దేవుడా అని బిక్కముఖం వేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఐదారు రోజుల్లోనే వడ్లమ్ముడువోయి 72గంటల్లోనే ఖాతాలో డబ్బులు పడేవని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెబుతున్న కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేక ఒక్కో రైతుకు కనీసం పది రోజులు గడిచినా కాంటా కావడం లేదు. తాలు, తేమ అని అడ్డమైన కొర్రీలు పెడుతూ నిర్వాహకులు ఇబ్బందులు పెడుతుండడంతో కర్షకులు గగ్గోలు పెడుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 1,039 కేంద్రాలు ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్లో సుమారు 7,650 మెట్రిక్ టన్నుల వడ్లను మాత్రమే కొన్నారు. కేంద్రాల్లో బార్దాని, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు సరిపడా లేవు. తూర్పారబట్టేందుకు ప్యాడీ క్లీనర్లు తెచ్చుకోవాలంటున్నారని రైతులు వాపోతున్నారు. బయట నుంచి తెస్తే గంటకు రూ.600 నుంచి రూ.700 అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి పది రోజలు దాటినా వడ్లు కాంటా కావడం లేదని చెబుతున్నారు. ఒకవేళ కాంటా అయినా మిల్లులకు పోవాలంటే మరో ఐదారు రోజులు పడుతోందని, ఇలా మొత్తం 15 రోజులు దాటుతోందని అంటున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నానా కొర్రీలు పెట్టడం, రోజుల తరబడి కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు దిక్కులేక వ్యాపారులు, మిల్లులను ఆశ్రయిస్తున్నారు. మద్దతు ధర ఏ-గ్రేడ్ రకానికి రూ.2203, బీ-గ్రేడ్కు రూ. 2183 ప్రకటించినా గింజ చిన్నగా ఉందని, తాలు, తేమ ఉందని కుంటి సాకులు చెబుతూ బీ-గ్రేడ్ కింద కాంటా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 కిలోల సంచికి దాదాపు కిలోన్నర వడ్లు కోత పెడుతున్నారు. రవాణా చార్జీలు అదనంగా మీద పడుతున్నాయి. అధికారులతో మిల్లర్లు కుమ్మక్కయి నిలువునా దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులు నేరుగా కల్లాల వద్దకే వచ్చి క్వింటాల్కు రూ. 1,950 నుంచి రూ.2,100 వరకు పెట్టి కొంటున్నారు. 40 కిలోల సంచికి రెండు కిలోలు కోత పెడుతున్నారు. రైతులే మిల్లులకు తీసుకపోతే రూ. 2150 వరకు ధర పలుకుతోంది. సంచికి కిలో చొప్పున కోత ఉంటున్నది. 15 రోజుల్లోగా డబ్బు చెల్లిస్తున్నారు. తక్షణమే డబ్బు కావాలంటే మొత్తం నుంచి మూడు శాతం తీసుకొని ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేదని రైతులే చెబుతున్నారు. కేంద్రాలకు తీసుకెళ్లిన ఐదారు రోజుల్లోనే అమ్ముడు పోయి 72 గంటల్లోనే నేరుగా ఖాతాల్లో డబ్బు పడేదని గుర్తు చేస్తున్నారు.
నేను ఆరెకరాల్లో వరేసిన. నీటి ఎద్దడితోని మస్తు తక్లీబైంది. అటో..ఇటో చేసి పంటను కాపాడుకున్న. మొన్ననే కోసి వడ్లను సెంటర్కు తెచ్చిన. ఇక్కడ గడికో ముచ్చటజెప్పి మస్తు సతాయిస్తుండ్రు. తాలు వత్తందని అంటున్నరు. వాళ్లిచ్చిన మిషన్లనే వడ్లు పట్టినంక మల్ల తాలెట్ల వస్తదో సమజైతలేదు. వడ్ల గింజ చిన్నగుంది, దీనికి వేరే రేటు అంటున్నరు. 40కిలోల బ్యాగు మీద కిలోన్నర వడ్లు తరుగుదీస్తున్నరు. ఆరుగాలం కష్టపడి పండించి అమ్ముకునే టైంల గిట్ల సతాయించుడేందో నాకైతే సమజైతలేదు.
-కొరిగింజ నర్సింహులు, రైతు, మద్దూరు(సిద్దిపేట జిల్లా)
మా ఊర్లె కొనుగోలు కేంద్రం పెట్టి పదిహేను రోజులైంది. ఇప్పటివరకు ఒక్క లారీ కూడా పోలేదు. నేను వడ్లు తెచ్చి వారమైంది. వడ్లు పోసేందుకు ఇక్కడ జాగ కూడా లేదు. ఇంతవరకు బార్దాని ఇవ్వనేలేదు. నాకంటే ముందొచ్చిన వాళ్ల వడ్లు కూడా అమ్ముడుపోలేదు. మొగులు దిక్కు చూస్తే భయమైతాంది. ఎక్కడ వడ్లు తడుస్తయోనని!. వడ్లు ఎప్పడు కొంటారో అని రోజూ చూసుడైతాంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్ల లేకుండె. వడ్లు తేంగనే మ్యాచర్ చూసి రెండు రోజుల్లో కాంట పెట్టి లారీలకు ఎక్కిత్తురు. ఇప్పుడట్ల లేదు. కేంద్రాలు పెట్టినమని చెప్పుడే తప్ప కాంట అయిత లేదు. ఈ సారి పంటలు ఎండి నిరుడు యాసంగి కన్న తక్కువ వడ్లు వచ్చినయ్. రైతులను ఆగంజెయ్యకుండ వెంటనే వడ్లు కొనాలె.
-బుడిగె శ్రీనివాస్, గురువన్నపేట, కొమురవెల్లి మండలం (సిద్దిపేట జిల్లా)