Telangana | కేసీఆర్ పాలనలో కనిపించిన జలదృశ్యాలు కాంగ్రెస్ పాలనలో కనుమరుగయ్యాయి. మండుటెండల్లో మత్తళ్లు పోసిన చెరువులు మార్చి నెలలోనే నోళ్లు తెరిచాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చాటేయడంతో కాలువలన్నీ బోసిపోయాయి. నిరుడులాగే సాగునీళ్లు వస్తాయని, పుట్లకొద్దీ ధాన్యపు రాశులు పండుతాయనుకున్న రైతులు నేడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. పంటలకు సాగునీళ్లు వస్తాయని కండ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. మత్తళ్లు లేకపోయినా.. మచ్చుకైనా నీళ్లు రాకపోవడంతో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే కాలువలో కనుమరుగైన నీళ్లు రైతుల కండ్లలో కనిపిస్తున్నాయి.
– నమస్తే తెలంగాణ, న్యూస్నెట్వర్క్
ఇది నల్లగొండ జిల్లా కనగల్ మండల పరిధిలోని కనగల్ వాగుపై ఉన్న కత్వ.. నిరుడు మార్చిలో పైనుంచి వస్తున్న వరద పరవళ్లతో మత్తడి పోస్తున్న కత్వ సోయగాన్ని చూడటానికి రెండు కండ్లు సరిపోలేదు. ఇదే జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఉన్న చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల నుంచి వచ్చే వరద నీటితో ఈ కనగల్ కత్వ కనువిందు చేసింది. ఈ సంవత్సరం వరదనీరు రాకపోవడంతో ప్రస్తుతం కత్వను చూసిన రైతులు కన్నీరు కారుస్తున్నరు. నేడు దీని పరిధిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా సాగు, తాగునీటికి ప్రజలకు అవస్థలే మిగిలాయి.
ఇది మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ ఆకేరు చెక్డ్యాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్చి నెలలోనే మత్తళ్లు పోసిన ఈ చెక్డ్యాం కాంగ్రెస్ పాలనలో ఆగమైంది.
ఎస్సారెస్పీ నీళ్లు తీసుకువస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ముఖం చాటేశారు. దీంతో ఆకేరువాగు చెక్డ్యాం నీళ్లులేక వెలవెలబోతున్నది.
– నర్సింహులపేట
ఇది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్, కురిక్యాల గ్రామాల మధ్యలో ఉన్న వరద కాలువ. కేసీఆర్ పాలనలో ఏడాది పొడవునా ఈ కాలువలో నీళ్లు నిండి ఉండడంతో రైతులు మోటార్లు పెట్టుకుని సాగు చేసుకునేవారు. కాంగ్రెస్ హయాంలో వరద కాలువ వట్టిపోయి మళ్లీ సమైక్య పాలనను గుర్తుచేసిందని రైతులు చెప్తున్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవ్పాడు నుంచి కృష్ణాబ్యాక్ వాటర్ గోపులాపురం, మక్తల్ లిఫ్ట్ 2 ద్వారా సంగంబండ రిజర్వాయర్కు చేరుకుంటాయి. రాజీవ్ బీమా ఫేజ్ 1 పరిధిలోని ఈ రిజర్వాయర్కు నిరుడు కాలువ ద్వారా నీళ్లు నిండుగా పారాయి. ఈ ఏడాది కృష్ణాలో నీరు తగ్గుముఖం పట్టి కాలువలో నీళ్ల జాడ కనిపించడం లేదు.
కేసీఆర్ పాలనలో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో బొమ్మకల్లు చెరువు మండుటెండల్లోనూ మత్తడి పోసింది. శ్రీరాంసాగర్ జలాలతో పెద్దవంగర రైతుల సాగు పండుగలా సాగింది. కాంగ్రెస్ హయాంలో శ్రీరాంసాగర్ జలాలను వదలకపోవడంతో బొమ్మకల్లు చెరువు బోసిపోతున్నది. పంటలకు నీళ్లందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
– పెద్దవంగర
ఇది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పరిధిలోని మున్నేరు వాగు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిరుడు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ జలాలతో నిండు ఎండకాలంలోనూ జలకళను సంతరించుకున్న ఈ వాగు ఈ మార్చిలోనే ఇలా ఒట్టిపోయింది. పంటలకు సాగునీళ్ల సంగతి దేవుడెరుగు, పశువుల దాహార్తిని తీర్చేందుకు కూడా నీళ్లు లేవని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన మార్పు ఇదేనా ? అని రైతులు మండిపడుతున్నారు.
– డోర్నకల్