పెద్దపల్లి/భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 29: మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టి మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో నీటిని నిల్వ ఉంచి సాగుకు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లిలోని కలెక్టరేట్ ఎదుట మంథని నియోజకవర్గ రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో ఏవో శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తలాపునే గోదావరి పారుతున్నా వాడుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు. గోదావరి, ప్రాణహిత నీళ్లు ఆంధ్రా ప్రాంతానికి తరలిపోయి వృథాగా సముద్రంలో కలిసిపోతున్నా పట్టించుకునేవారే లేరని, ఫలితంగా సాగునీటికి అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించినట్టు చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించి వాటి ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్లోకి ఎత్తిపోసి సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
గోదావరి నది మీద బరాజ్ల నిర్మాణంతో ఎప్పుడూ నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల కింద సాగు విస్తీర్ణం పెరిగిపోయిందని చెప్పారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బరాజ్లోని రెండు పిల్లర్లు కుంగిపోయాయనే సాకుగా చూపించి మరమ్మతులు చేయకపోవడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టును ఎండబెట్టడం వల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత గత ఐదేండ్లుగా సాగునీటికి ఎలాంటి సమస్య రాలేదని అన్నారు. ఇప్పటికైనా స్పందించి బరాజ్కు వెంటనే మరమ్మతులు చేయించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్నదని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్కు జరిగిన ప్రమాదాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ తప్పుగా చూపిస్తూ కాలయాపన చేయకుండా వెంటనే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి పొలాలకు అందించాలని భూపాలపల్లి మండలంలోని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం వారు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయ ఏవో మహేశ్బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కరువు పీడితులమై దుఃఖించిన తమ ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కల్పతరువుగా మారిందని అన్నారు. బీడు భూములన్నీ కొంతకాలంగా కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా మారాయని పేర్కొన్నారు. కానీ ఇటీవల దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్లోని మూడు పిల్లర్లకు పగుళ్లు రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ దానిని తప్పుగా చూపిస్తూ కాలయాపన చేస్తున్నందున పంటలకు నీరందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పిల్లర్లకు మరమ్మతులు చేపట్టి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయాలని వారు కోరారు.