ఎన్నో ఆశలతో చూపుడు వేలుకు సిరా చుక్క అంటించుకున్నారు. ఆ ఇంకు చుక్క ఆరక ముందే.. ఐదువేళ్ల కాంగ్రెస్ చెయ్యి గుర్తుకు ఓటేశారు. పోలింగ్ నాడు వేలుకు అద్దిన ఇంకు రంగు రూపుమాపకముందే.. కన్నడిగులకు కష్టకాలం మొదలైంది. భారీ గ్యారంటీలు నమ్మిన బడుగు జీవుల బతుకులకు ఆరు మాసాలు గడవకముందే వారంటీ ఎక్స్పైర్ అయ్యింది.
కరెంట్ కోతలు మొదలయ్యాయి. చేతికొచ్చిన పంటలు ఆగమయ్యాయి. పత్తి చేను ఎండిపోయింది. మిరప పంట జీవం కోల్పోయింది. వరి వెన్ను విరిగింది. ప్రభుత్వమూ చేతులు ఎత్తేయడంతో ఎవరి సాయమూ అందదని అర్థమయ్యింది. బతుకు సాగేదెలా?
ఒకనాడు వలస జీవులకు ఆసరాగా నిలిచిన కర్ణాటక రైతులు పొట్టకూటి కోసం భారంగా అడుగులు వేశారు. ఊరి పొలిమేర దాటారు. రాష్ట్రం సరిహద్దు దాటారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న తమ రాష్ట్రం కన్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ పదిలం అనుకున్నారు. రాయచూర్ జిల్లా నుంచి జనగామ జిల్లా దేవరుప్పల మండలానికి చేరుకున్నారు. ఇక్కడి నల్లకుంట తండాలో గుంపుగా మకాం వేశారు. గంపగుత్తగా పత్తి ఏరే పనిలో నిమగ్నమయ్యారు. అందరూ సన్నకారు రైతులే! వీరందరి మాటా ఒకటే! ‘కాంగ్రెస్ మా పొట్ట కొట్టింది. ఆ పార్టీకి మీరు ఓటేసి పచ్చగ ఉన్న తెలంగాణను పాడు చేసుకోవద్దు’ అని! ఈ హెచ్చరిక చేస్తున్న కర్ణాటక రైతు కూలీలు ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న అనుభవాలివి..
ఆరు నెలల కిందట కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. కమీషన్ల కమలం పార్టీని గద్దె దించాలని ఊరూవాడా బలంగా అనుకుంది. దేశమంతా హస్తవాసి తగ్గడంతో ఎలాగైనా కర్ణాటకలో గెలుపే లక్ష్యంగా శుష్క వాగ్దానాలను గ్యారంటీలుగా ప్రచారం చేసింది కాంగ్రెస్. మత రాజకీయాలతో కర్ణాటక ప్రభను మసకబార్చిన బీజేపీని గద్దె దించాలనీ, ఐదేండ్ల కిందట ఓడించడంతో బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పాలిస్తుందనీ నమ్మి హస్తం పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చారు ప్రజలు. కానీ, అధికారం అందుకున్న కాంగ్రెస్ అంతలోనే జనం ఓర్పునకు కఠిన పరీక్ష పెట్టింది.
కరెంట్ ఇవ్వలేమని మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకున్నా.. ఐదు గంటలు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయలేక రైతులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టేశారు. చివరికి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం హామీ కూడా కొత్త షరతులొచ్చాయి. వాటిని భరించలేక… కండ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి తట్టుకునే శక్తి లేక… రాయచూరు జిల్లా నుంచి నల్లకుంట తండాకు 20 మందితో కూడిన జట్టు వచ్చింది. ఇక్కడి గిరిజన రైతుల పొలాల్లో పత్తి ఏరుతున్నది.
…? ఈటూరి విజయ్కుమార్
కాంగ్రెస్ పార్టీ నిండా మోసం చేసింది. వాళ్లిచ్చిన హామీలన్నీ నమ్మినం. ఓట్ల నాడు చెయ్యి గుర్తుకు ఓటేసినం. ప్రభుత్వం వచ్చాక మా ఆశలన్నీ నీరుగారిపోయినయ్. కరెంటు అస్సలు ఉంటలేదు. సాగునీరు లేక రెక్కల కష్టమంతా నాశనమయ్యింది. మా దగ్గర చాలావరకు చిన్న కమతాలే ఉంటయ్. ఒక ఎకరం, రెండు ఎకరాలు! నాలుగు నెలలు తిప్పలు పడితే.. ఇంత తిండి దొరుకుతుందని ఆశపడ్డం. ఏం లాభం! కాంగ్రెస్ వచ్చినంక కరెంట్ తిప్పలు మొదలైనయ్. కరెంటు రాక, నీళ్లు లేక పొలాలన్నీ ఎండి పోయినయ్. అందరు రైతుల పరిస్థితీ అదే! పని దొరకడం కూడా కష్టమైంది. ఇక లాభం లేదనుకొని ఇంత దూరం వచ్చినం. ఇక్కడ నెల రోజుల పనుంది.
ఈ ఊళ్లు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నయో! నీళ్లు దుంకుతున్నయ్. ఇండ్లలోనే కాదు బాయి దగ్గర కూడా 24 గంటలు కరెంటు ఉంటున్నది. ఊరోళ్లతోని మాట్లాడతం కదా! కేసీఆర్ రైతులకు చేస్తున్న మంచి పనులు తెలిసి చాలా ఆశ్చర్యపడ్డ. పంట పెట్టుబడికి పైసలు ఇస్తున్నడట కదా! రైతు బీమా, కల్యాణలక్ష్మి పథకాల గురించి కూడా ఊరోళ్లు అన్నరు. నిండా నీళ్లతో చెరువు ఎంత బాగున్నదో! మావోళ్లు ఇవన్నీ చూసి కేసీఆర్ మొగోడురా అంటున్నరు! ఆయన మా దగ్గర నిలబడితే బాగుండు. ఇప్పటికే మా రాయచూర్లో కేసీఆర్ అంటే చాలా క్రేజ్. ఆయనలాంటి సీఎం ఉంటే.. మేం ఇంత దూరం వచ్చేటోళ్లమే కాదు! ఇక్కడ ఎలక్షన్లట కదా! కాంగ్రెస్ ఏవేవో హామీలిస్తుందని విన్నం. అవి నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే మా పొట్టకొట్టినట్టే.. మీ బతుకులనూ ఆగం చేస్తది!
– నర్సింహ, మార్కపురం, రాయచూర్ జిల్లా
కూలీ నాలీ దొరక్క తిండి కోసం అప్పులు చేసినం. అవి తేర్పడానికి తెలంగాణల పత్త్తి పనికి వచ్చినం. మా ఇంట్లోళ్లు అందరం వస్తం. ఇక్కడ మాకు ఉండటానికి ఇండ్లు ఇస్తరు. ఇక్కడ నెల రోజుల పని ఉంటది. రోజుకు ఒక్క మనిషికి రూ.500 నుంచి రూ.700 సంపాదిస్తాం. ఖర్చులు పోను రూ.50 వేలు సంపాదిస్తాం. మా దగ్గర చేద్దామంటే పంటలు మొత్తం ఎండిపోయాయి. కూలి దొరుకుతలేదు. బతుకుడే కష్టంగా ఉంది. అప్పులు కూడా పుడుతలేవు. తెలంగాణలో చేసినంత పని ఉంది. ఒకటి కాకపోతే ఇంకోటి దొరుకుతది.
– ఆంజనేయ లక్ష్మి, రాయచూర్
నాకు 70 ఏండ్లు దాటినయ్. ఈ వయసులో కూడా కైకిలి పనికి వచ్చానంటే మా దగ్గర ఎంత తిప్పలున్నయో అర్థం చేసుకోండి. మా దగ్గర పింఛన్ ఎనిమిది వందలే ఇస్తున్నరు. ఇక్కడిచ్చినట్టు మా దగ్గర కూడా రెండువేలు ఇస్తే.. ఈ ముసలితనంలో గింత కష్టం నాకు తప్పుతుండే!
పింఛన్ సరిపోక, బతుకు దెరువు దారి లేక వలసొచ్చిన. కాంగ్రెస్ పార్టీని గెలిపిచ్చి దండుగ చేసుకున్నం. మాయ మాటలు చెప్పి ఓట్లేయించుకున్నరు. పొద్దాక కరెంటు తీసేస్తున్నరు. రాత్రిపూట కూడా గుడ్డి దీపాలే దిక్కయితున్నయి. ఇక్కడ కరెంట్ పోంగ నేనైతే చూడలే. బోర్లయితే నీళ్లు పోస్తనే ఉన్నయి. తెలంగాణలో కేసీఆర్ బాగా చేస్తుండని మా దగ్గర చెప్పుకొంటరు. ఇక్కడికి వచ్చాక నిజమనిపిస్తున్నది. ఇక్కడ ముసలోళ్లకు 2,016 పింఛన్ ఇస్తున్నరట. మళ్లీ గెలిచాక పింఛన్ మూడు వేలు చేస్తాన్నడట. మంచినీళ్లయితే చాలా తియ్యగా ఉన్నయి. ఇంటింటికీ నల్లా చూస్తే ఎంత ముచ్చటనిపించిందో! మా దగ్గర ఉప్పు నీళ్లే గతి. పువ్వు పార్టీ వాళ్లను కాదనుకొని కాంగ్రెస్కు ఓటేస్తే మా బతుకులు ఇంకా ఆగం చేసినరు. నేనైతే కాంగ్రెస్కు ఓటెయ్యొదని ప్రచారం చేస్త.
– బింగన్న బజరమ్మ, రాయచూర్