కరీంనగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకం కింద తమకు ప్రయోజనం కల్పించాలంటూ ఇద్దరు రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రుణమాఫీ అమలు చేయాలంటూ ఇద్దరు రైతులు సమర్పించిన వినతిని పరిశీలించి, చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తీసుకునే నిర్ణయాన్ని రెండు వారాల్లోగా పిటిషనర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల తీర్పు వెలువరించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన సన్నకారు రైతులు పెట్టం సదయ్య, ఏకుల శ్రీనివాస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమకు రుణమాఫీ పథకం కింద ప్రయోజనం కల్పించాలని కోరుతూ వారు 2026 జూలై 7న సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.
ఒక రైతుకు రూ.2,00,778 వ్యవసాయ రుణం ఉండగా, రెండో రైతుకు రూ.2,04,555 రుణం ఉన్నట్టు పిటిషన్లో పేరొన్నారు. అర్హతలు ఉన్నప్పటికీ తమ పేర్లను రుణమాఫీ జాబితాలో చేర్చలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్లు చివరిసారిగా గత జూలై 7న సమర్పించిన వినతిని సంబంధిత అధికారులు పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాది కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావించింది.
పిటిషనర్లు జూలై 7న చెంజర్ల గ్రామ వ్యవసాయ అధికారికి సమర్పించిన వినతిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాటిని ప్రభుత్వం పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పిటిషనర్లు తమ వినతిలో పేర్కొన్న రుణమాఫీ ప్రయోజనాలపై ఉన్న ఫిర్యాదును ప్రతివాదులైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ ఇతరులు పరిశీలించి, చట్టానికి అనుగుణంగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఈ నెల 13న తీర్పు చెప్పింది. ఈ ఉత్తర్వు కాపీ అందిన తేదీ నుంచి రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.
నేను చెంజర్లలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాను. రుణమాఫీ నాటికి వడ్డీతో కలిపి లోన్ మొత్తం రూ.2,04,555 ఉన్నది. రూ.2 లక్షల కంటేపైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులో చెల్లిస్తే రుణమాఫీ చేస్తామని అపుడు ప్రభుత్వం ప్రకటించింది. నేను బ్యాంకుకు వెళ్లి అడిగితే లేదు రుణమాఫీ అయిన తర్వాతనే చెల్లించుకోవచ్చునని బ్యాంకు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టర్కు, డీఏవోకు వినతిపత్రం ఇచ్చాను. విధి లేక కోర్టును ఆశ్రయించాను.
– పెట్టం సదయ్య, పిటిషనర్
నేను మానకొండూర్లోని యూనియన్ బ్యాంకులో పంట రుణం తీసుకున్నాను. రుణమాఫీ ప్రారంభమైనపుడు నాకు రూ.2,00,778 రుణం ఉన్నట్టు అధికారులు గుర్తించి అర్హుల జాబితాలో చేర్చారు. రుణమాఫీ వర్తిస్తుందని ఆశించాను. ఇప్పటివరకు కాలేదు. దీంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
– ఏకుల శ్రీనివాస్, పిటిషనర్