Urea | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): మొన్న నల్లగొండలో, నిన్న ఆదిలాబాద్లో, నేడు నిర్మల్లో ఇలా వరుసగా రోజుకోచోట యూరియా కొరత సమస్య తలెత్తుతున్నది. రైతులు యూరియా కోసం మళ్లీ క్యూ లైన్లలో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. యూరియా వినియోగం అత్యధికంగా ఉండే ఈ సమయంలో అవసరమైనన్ని నిల్వలను అందుబాటులో ఉంచడంలో ఇటు వ్యవసాయ శాఖ, అటు మార్క్ఫెడ్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే యూరియా కొరతపై క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, అధికారులు చెప్పేదానికి పొంతన లేకుండా ఉంది. అధికారులు మాత్రం యూరియా కొరత అసలే లేదని, గతేడాది కన్నా సుమారు 2 లక్షల టన్నులు అధికంగా నిల్వలు ఉన్నాయని అంటున్నారు. అదే నిజమైతే… యూరియాను సకాలంలో రైతులకు చేరవేయడంలో వారే విఫలమవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైతులకు సకాలంలో యూరియాను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిల్వలు ఉన్నప్పటికీ సరఫరా లేదంటే ఇది కచ్చితంగా నిర్లక్ష్యమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరనేది తేల్చాల్సి ఉంది. ఈ కృత్రిమ కొరతపై ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
కొరతకు ‘సమ్మె’ సాకు…
యూరియా కొరతను కప్పిపుచ్చుకొనేందుకు అధికారులు కుంటిసాకులు చెప్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో యూరియా కొరతకు లారీ డ్రైవర్ల సమ్మె కారణమని అధికారులు చెప్పారు. మూడు నాలుగు రోజులుగా లారీ డ్రైవర్ల సమ్మెతో ట్రాన్స్పోర్ట్ పూర్తిగా స్తంభించిందని, అందుకే యూరియాను సరఫరా చేయలేకపోయామని అన్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సమ్మె కొనసాగి ఉంటే యూరియాతోపాటు ఇతర ఎరువుల సరఫరాను కూడా పూర్తిగా నిలిపేసేవారా అని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. ఇప్పటికీ పలు జిల్లాల్లో యూరియా కొరత ఉండటం గమనార్హం. కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో యూరియా కొరత ఉన్నట్టు సమాచారం.
వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ సమన్వయ లోపం
ఎరువుల పంపిణీలో మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. జిల్లాల్లో జిల్లా వ్యవసాయ అధికారి అనుమతితో ప్రాథమిక సహకార సంఘాలకు మార్క్ఫెడ్ ద్వారానే ఎరువులు సరఫరా అవుతాయి. ఇక్కడే రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖకు చెందిన డీఏవోలకు, మార్క్ఫెడ్కు చెందిన డీఎంలకు మధ్య పొసగడం లేదని, అందుకే యూరియా సరఫరాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే చర్చ జోరుగా సాగుతున్నది. డీఎంలు అడిగినంత స్టాక్కు డీఏవోలు అనుమతించడం లేదని తెలిసింది. నిర్మల్లో జరిగిన ఘటనలో అక్కడి డీఏవో, డీఎం మధ్య సమన్వయలోపమే యూరియా కొరతకు దారితీసిందనే వాదన వినిపిస్తున్నది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తతంగం కొనసాగుతున్నదని అంటున్నారు. మార్క్ఫెడ్ నుంచి వచ్చే యూరియా స్టాక్ను పీఏసీఎస్లకు ఇచ్చేందుకు అనుమతి నిరాకరిస్తున్న డీఏవోలు… ప్రైవేటు కంపెనీలకు మాత్రం విచ్చిలవిడిగా అనుమతులు జారీ చేస్తున్నారని డీఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు విభాగాల మధ్య సమన్వయం లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చేతులెత్తేసిన రవాణా కాంట్రాక్టు సంస్థ
యూరియా కొరత ఏర్పడకుండా చూడాల్సిన రవాణా కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు జిల్లాలు మినహా రాష్ట్రమంతటా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎరువుల నిర్వహణ, రవాణా కాంట్రాక్టును ఓ బడా సంస్థ దక్కించుకున్నది. ఈ సంస్థకు సొంతంగా లారీలు ఉన్నాయని, ఏ పరిస్థితుల్లో అయినా ఎరువులను రవాణా చేసే సామర్థ్యం ఉందంటూ గతం లో అధికారులు ఆ సంస్థను వెనకేసుకొచ్చారు. పదేండ్లుగా ఆ సంస్థకే కాంట్రాక్టును కట్టబెడుతున్నా రు. ఇప్పుడు అవసరమైన సమయంలో ఆ సంస్థ చేతులెత్తేయడం గమనార్హం. డ్రైవర్ల సమ్మె జరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత సదరు సంస్థకు లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో సేవలు అందించకుండా చేతులెత్తేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
యాసంగి సాగు… 34 లక్షల ఎకరాలు
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటివరకు 34 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి 32.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు పేర్కొంది. ఈ ఏడాది అత్యధికంగా వరి 23.36 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే 1.73 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు కావడం గమనార్హం. మక్కజొన్న 3.96 లక్షల ఎకరాల్లో, శనగ 2.48 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 1.95 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.