వనపర్తి : నాటి సమైఖ్య పాలనలో తెలంగాణ రైతుల బతుకులు ఎట్లుండే. తాగు, సాగు నీళ్లులేక, కరెంట్ రాక, పెట్టుబడి సాయం అందక, కల్తీ ఎరువులు, పురుగుల మందులతో అప్పుల పాలైన అన్నదాతలు ఆత్మహత్యలతో కుటుంబాలకు తీరని శోకం మిగులస్తూ తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించే వారు.
నేటి తెలంగాణ ఎట్లుంది. నిండుకుండలను తలపించేలా చెరువులు, కుంటలు. కనుచూపు మేర నీళ్లతో జలశోభను సంతరించుకున్న తెలంగాణ పల్లెలు. రెప్పపాటు కూడా పోని కరెంట్, చినుకుపడగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరలు, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రైతుబీమా వెరసి నేడు తెలంగాణ రైతులు సిరులు పండిస్తూ దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నాడు. ఇది నేటి నిజం.
ఇదంతా సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన రైతుబంధు పథకంతో సాధ్యమైంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన రైతు బంధు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి..పది రోజుల పాటు రైతుబంధు ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.
దీంతో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు, హారతులు పడుతూ తమ కృతజ్ఞతలను తెలుపుతున్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజేపల్లి జంగమయ్య పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని వేసిన చిత్రాలు అందరిని ఆలోచింపజేస్తూ ఔరా అనిపించాయి. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత రైతుల జీవితాలు ఎలా ఉన్నాయో కే.రాధిక అనే 8వ తరగతి విద్యార్థిని ఒక్క చిత్రం ద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది.
నాడు ఉరితాళ్లకు వేలాడుతున్న రైతులు..నేడు పంట చేలల్లో పసిడి సిరులు పండిస్తున్న రైతులు అనే ఎరుకతో అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించి శభాష్ అనిపించుకుంది.