వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నను ఆదిలోనే కష్టాలు పలుకరించాయి. ఎరువులు, విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వరి, పత్తి, జీలుగ విత్తనాల కోసం రైతన్న కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. అప్పుడెప్పుడో దాదాపు దశాబ్దం క్రితం మాయమైన విత్తన క్యూలు మళ్లీ దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి లైన్లలో నిలబడలేని రైతులు చెప్పులు, పాస్ పుస్తకాలు పెడుతూ మునుపటి రోజులను గుర్తుచేసుకుని రందిపడుతున్నారు. ఇదే అదునుగా చెలరేగిపోతున్న అక్రమార్కులు నకిలీ విత్తనాలతో రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎడాపెడా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇంకోవైపు, విత్తనాలు, ఎరువులు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. అధిక ధరలు రైతులను పీల్చిపిప్పిచేస్తున్నాయి.
సర్కారు అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. వానకాలం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఎక్కడచూసినా విత్తనాల కోసం అన్నదాత అరిగోస పడుతున్నాడు. డిమాండ్ మేరకు సరిపడా, అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో వారికి పాట్లు తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా కందవాడలో, కామారెడ్డి జిల్లా రాజంపేటలో విత్తనాలు, ఎరువుల కోసం రోజంతా ఎర్రటి ఎండలో రైతులు క్యూలో నిల్చొని తీవ్ర అవస్థలు పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఏర్పాటుచేసిన విత్తన మేళాల్లో అవసరమైన విత్తనాలు సరిపడా ఉంచలేదని పలుచోట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు.
వ్యవసాయ యూనివర్సిటీ/చేవెళ్ల రూరల్/రాజంపేట, మే 24: రాష్ట్రంలో రైతులకు విత్తనాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. ముందస్తు ప్రణాళిక లోపించడంతో సరిపడా విత్తనాలు లభ్యం కావడం లేదు. గత యాసంగిలో ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఒకవైపు పంటలు ఎండిపోగా, మరోవైపు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టాలపాలయ్యారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ వానకాలం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న ఆశ రైతుల్లో చిగురించింది.
ఆ ఆశను సర్కారు నిర్లక్ష్యం విత్తన కొరత రూపంలో ఆదిలోనే తుంచేసేలా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించిన విత్తన మేళాల్లో రైతులు పోటెత్తారు. వారికి అవసరమైన విత్తనాలు సరిపోను లేక తీవ్ర నిరాశకు గురయ్యారు. గత పదేండ్లలో ఇంతటి గోస పడలేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విత్తన మేళాకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సరిపడా విత్తనాలు లేక చాలామంది రైతులు నిరాశగా వెనుదిరిగి పోయారు. ఈ మేళాలో 16 రకాల పంటలకు 67 రకాల విత్తనాలను సుమారు 20 వేల క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉంచారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్-11718 విత్తనాలను రైతులు అడిగారు. సరిపడా లేక రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకేచోట అన్నిరకాల విత్తనాలు ఉంచడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధి కందవాడలోని రైతువేదికలో శుక్రవారం రైతులు సబ్సిడీ జనుము, జీలుగ విత్తనాల కోసం ఉదయం నుంచి ఎండలోనే పడిగాపులు కాశారు. అధికారులు కనీసం నీరు, నీడ సదుపాయాలు కూడా ఏర్పాటుచేయలేదు. తోపులాట కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడ్దారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై మండిపడ్డారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులను సముదాయించి పర్మిట్ స్లిప్పులను అందజేశారు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ ప్రాథమిక సహకార సంఘం వద్ద శుక్రవారం జీలుగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడ్డారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు ఉదయం నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు మండుటెండలో కాగితాలతో క్యూలోనే నిలిచి ఉన్నారు. కాగితాలు ఎగిరిపోకుండా వాటిపై చిన్నచిన్న రాళ్లను ఉంచారు. గంటల తరబడి క్యూలో నిల్చుని వెళ్తే ఒక పాస్ పుస్తకానికి ఒక బస్తా చొప్పున విత్తనాలు ఇవ్వడంతో అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సరిపడా ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు.
హైదరాబాద్/వికారాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో ఓ వైపు నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతుండగా, పత్తి విత్తనాల బ్లాక్ దందా జోరుగా కొనసాగుతున్నది. రేవంత్, ఆధ్య, యూఎస్-7067, సదానంద్ రకాల పత్తి విత్తనాలకు అ ధిక డిమాండ్ ఉన్నది. వాటి కోసం రైతులు డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. డీలర్లు విత్తనాలు స్టాక్ లేవంటూ బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏ రకం పత్తి విత్తనాలైనా ఒక ప్యాకెట్ ధర రూ.864గా ప్రభుత్వం నిర్ణయించగా, డీలర్లు బ్లాక్లో ఒక్కో ప్యాకెట్పై అదనంగా రూ.1,000కి పైగా విక్రయిస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ఇటీవలే వ్యవసాయాధికారులు, పోలీసులు దాడులు చేసి జిల్లాలోని కొడంగల్, యాలాల్, దౌల్తాబాద్ మండలా ల్లో రూ.39 లక్షల విలువ చేసే 23 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అయినా ఈ దందా ఆగడం లేదు.
వానకాలం సాగుకు రాష్ట్రంలో అవసరమైన వి త్తనాలు, ఎరువులను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బీ గోపి తెలిపారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన విత్తనమేళా-2024ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని రైతుల డిమాండ్కు అనుగుణంగా అన్ని జిల్లా ల్లో అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడానికి రెండు నెలల నుంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కమిషనర్ గోపి చెప్పారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు విత్తన చట్టంలో సవరణలకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. విత్తన మేళాలో 2,800 మం ది రైతులకుపైగా హాజరయ్యారు. రూ.73.5 లక్షల విలువైన 482 క్వింటాళ్ల విత్తనాలను ఒక్కరోజే కొనుగోలు చేశారు.
కేసీఆర్ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే మాయదారి కాంగ్రెస్ వచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టింది. సాగునీళ్లు ఇయ్యలేదు, కరెంటు ఇయ్యలేదు, ఆఖరుకు రైతుభరోసా ఇయ్యలే. రైతుల పక్షాన మీరు పోరాడండి. మేమంతా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాం. అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం.
– హరీశ్రావుతో మిట్టపల్లి గ్రామ రైతులు