హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కుదిరితే చేయూతనివ్వాలి. చేతనైనే సాయం చేయాలి. అంతేకానీ, పొట్ట కొట్టొద్దు. కానీ.. కేంద్రం మాత్రం రైతన్న దగ్గరి డబ్బులు గుంజి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే కుట్రకు తెరలేపింది. ఎన్నో ఏండ్లుగా సవ్యంగా సాగుతున్న నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఎన్ఏఐఎస్)ను పక్కన పెట్టి 2016లో ప్రధాన మంత్రి ఫసల్బీమా యోజన (పీఎంఏవై)కు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ దోస్తుల కోసం.. మోదీ వేసిన వలకు కొన్ని రాష్ర్టాలు చిక్కాయి. తెలంగాణ మాత్రం రైతు పొట్టకొట్టే పథకం వద్దేవద్దని కుండబద్దలు కొట్టింది. రైతు సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని, అంతేతప్ప రైతును ముంచే కార్యక్రమాలకు తామెప్పుడూ అంగీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తేల్చి చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలో రైతు సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. మరే రాష్ట్రంలోనూ అమలులోలేని, అసలు ఆ ఆలోచనే చేయలేని రైతుబంధుకు శ్రీకారం చుట్టారు.
“ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన పథకంపై రైతులకు ఏమాత్రం అవగాహన లేదు. ఈ పథకంతో అన్నదాతలకు జరిగే లాభమేమీ పెద్దగా లేదు. బీమా కంపెనీలే భారీగా లాభపడుతున్నాయి. చివరికి బీమా కంపెనీలపై తనిఖీ అధికారం కూడా లేకపోవటం సరికాదు..” ఇదీ పసల్బీమా పథకంపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) అభిప్రాయం. పథకంపై, అమలు తీరుపై కాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఫసల్బీమా ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్లో అట్టర్ఫ్లాప్ అయ్యింది. ప్రీమియం కట్టించుకున్న కంపెనీలు రైతులకు పరిహారం అందించలేదని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ సంస్థ సర్వేలో తేలింది. ఫసల్బీమాతో రైతుల కంటే బీమా కంపెనీలకే అధిక లాభం చేకూరుతున్నదని సర్వే అభిప్రాయపడింది. అదేవిధంగా రైతులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫసల్బీమా పథకం కోసం కంపెనీలు రూ.100 తీసుకుంటే.. ఇచ్చేది రూ.50 నుంచి 60 మాత్రమే. మిగిలిన రూ.40 ఇన్సూరెన్స్ కంపెనీల జేబుల్లోకి వెళుతున్నాయనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. చివరికి, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ సంస్థ సర్వేలోనూ ఇదే విషయం తేటతెల్లమైంది.
“ఫసల్బీమాతో రైతులకు ప్రయోజనం కన్నా, రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారమే ఎక్కువ. అందుకే.. ఫసల్బీమా నుంచి వైదొలుగుతున్నాం. రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ… గుజరాత్లో ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఫసల్బీమాతో 15 నుంచి 17 లక్షల మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేది. కానీ మేం ప్రవేశపెట్టిన పథకంతో సుమారు 56 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది.” ఇవీ అప్పటి గుజరాత్ సీఎం విజయ్ రుపానీ చేసిన వ్యాఖ్యలు.
ఏదైనా ఒక పథకం తీసుకొచ్చేటప్పుడు అది అందరికీ ఆమోదయోగ్యమా? కాదా? ఇలా అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పరిస్థితి లేదు. మోదీవన్నీ సొంత ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలే! ఫసల్బీమాను ప్రవేశ పెట్టేటప్పుడు సైతం మోదీ అదే విధానాన్ని అమలు చేశారు. ఫలితంగా ప్రస్తుతం 33 శాతం రాష్ర్టాలు ఫసల్బీమాను వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణతోపాటు గుజరాత్, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ప్రదేశ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ తమ రాష్ర్టాల్లో ఫసల్బీమాను అమలు చేయటం లేదు. కేంద్రపాలిత ప్రాంతాలైన చంఢీగడ్, దాద్రా నగర్ హవేలీ – డామన్ డయ్యూ, ఢిల్లీ, లడఖ్, లక్షదీవులు సైతం ఫసల్బీమాకు దూరంగా ఉన్నాయి. ఇటువంటి ఒక విఫల పథకం గురించి తెలంగాణ బీజేపీ నేతలు అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన పథకం తీసుకొచ్చారని, కానీ కేసీఆర్ అమలు చేయటం లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చివరికి, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ ఫసల్బీమా అమలులో లేదనే కనీస అవగాహన రాష్ట్ర బీజేపీ నేతలకు లేకపోవడం బాధాకరం.
తెలంగాణలో ఫసల్బీమా యోజన అమలు చేయాలని అడుగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలరా? దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.228 కోట్లు సాయం ప్రకటించి రైతుబిడ్డ అని మరోసారి నిరూపించుకున్నారు. బీజేపీ నేతలకు ఇది చిన్నసాయంగా కనిపించటం దురదృష్టకరం. దేశంలో ఎకడైనా ఇంతకన్నా ఎకువ సాయం చేసినట్టు నిరూపించగలరా? నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. నేడు అదానీ ఆదాయాన్ని డబుల్ చేయటం నిజం కాదా?
– హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి