Telangana | హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. యాసంగిలో రైతుపై పాలకులతో పాటు ప్రకృతి కూడా పగబట్టింది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తక కాంగ్రెస్ తెచ్చిన కరువుతో సాగునీళ్లు కరువై పంటలు ఎండిపోయాయి. బావి, బోరు నీళ్లతోపాటు ట్యాంకర్లు, కిలో మీటర్ల కొద్దీ పైపులైన్లు వేసుకుని అరిగోస పడి కాపాడుకున్న కాసింత పంటలు కూడా అకాల వర్షాలకు ఆగమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వానలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కరువు ఒక వైపు, అకాల వర్షాలు మరో వైపు అన్నదాతలను కోలుకోని దెబ్బతీశాయి. పంటలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో పరిహాసమాడుతున్నది. కేవలం అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం ఇస్తామని ప్రకటించింది.
ఈ మేరకు పంట నష్టం సర్వే చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ నీళ్లు లేక ఎండిపోయిన పంటలపై మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. వర్షాలతో దెబ్బతింటేనే పంట నష్టమా ? .. నీళ్లు లేక పంటలు ఎండిపోతే నష్టం కాదా ? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎండిన పంటల సాగుకు పెట్టుబడి పెట్టలేదా ? అని నిలదీస్తున్నారు.
కరువు కాటే ఎక్కువ
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వడగండ్ల వానతో సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేసిన తరువాత వాస్తవ నష్టంపై స్పష్టత వస్తుంది. అయితే రాష్ట్రంలో వడగండ్లతో జరిగిన నష్టం కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు కాటే ఎక్కువగా ఉన్నది. సాగునీళ్లు కరువై పంటలు ఎండిపోయి రైతులకు తీరని నష్టం జరిగింది.
ఈ యాసంగిలో 66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో సుమారు 30 శాతం పంటలు సాగునీళ్లు లేక ఎండిపోతున్నట్టు అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు సమాచారం. వచ్చే నెల రోజుల్లో మరో 5 -10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉంది. అంటే ఈ ఒక్క సీజన్లోనే ఒక్క వరి పంటనే 20-25 లక్షల ఎకరాల్లో ఎండిపోతుండడం గమనార్హం. ఈ విధంగా వర్షాలతో తక్కువ నష్టం జరిగితే సాగునీళ్లు లేక ఎండిన పంటలతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
కాంగ్రెస్ మార్క్ పరిహారం
పంట నష్ట పరిహారం అందించడంలోనూ కాంగ్రెస్ సర్కారు తన మార్క్ రాజకీయం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరువుతో పోల్చుకుంటే వర్షాలతో జరిగిన నష్టం చాలా తక్కువే. కాంగ్రెస్ మంత్రులు కరువు రైతులను గాలికొదిలి.. వడగండ్ల రైతులను ఆదుకుంటామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనిపై పంటలు ఎండిపోయిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆలోచనను తప్పుపడుతూ.. నష్టం ఏ విధంగా జరిగినా నష్టమే అనే కనీస విజ్ఞత ప్రభుత్వానికి లేదా అని మండిపడుతున్నారు. తక్కువ మంది రైతులకు ఎంతో కొంత పరిహారం అందించి సర్కారు చేతులు దులిపేసుకోవాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి రైతులపై ప్రేమ, వారిని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వడగండ్లతో పాటు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు కూడా పరిహారం అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎండిన పంట నష్టంపై వెంటనే సర్వే చేయాలని రైతులు పట్టుపడుతున్నారు.
మేమేం పాపం చేశాం
సాగునీరందక పంట ఎండిపోయి రోదిస్తున్న రైతులం… మేమేం పాపం చేశాం. ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఆదుకోదు. ఇంకొక తడికి నీరందితే పంట మొత్తం చేతికందేది. అలాంటిది పూర్తిగా ఎండిపోయిన పంటలతో ఎక్కువ నష్టం వాటిల్లింది. పంటను కాపాడుకోవడానికి పెట్టుబడి పెరిగింది. కానీ ఫలితం దక్కలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట ఎండిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం అందించాలి.
– శేఖర్రెడ్డి, దుబ్బాక, నిజామాబాద్ జిల్లా
ఎకరాకు 20 వేలు ఇవ్వాలి
20 ఏండ్లుగా కౌలుకు చేసే పొలంలో ఎన్నడూ బావి ఎండిపోలేదు. ఈ సారి ఎండిపోయింది. నాలుగెకరాలు పూర్తిగా ఎండింది. మిగిలిన రెండెకరాలకు మూడ్రోజులకోసారి తడి కడుతున్నాం. పంట వచ్చేదాక అనుమానమే. ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 వేల చొప్పున చెల్లిస్తే తప్ప బతికే రోజులు లేవు.
– గంధమల్ల అయోధ్య, త్రిపురారం, నల్లగొండ