ఖమ్మం వ్యవసాయం, మార్చి 1: మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై సర్కారు ఆరా తీసింది. మార్కెటింగ్ అధికారుల తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని ఆదేశించారు. వివరాలు ఇలా.. ఖమ్మం ఏఎంసీకి జిల్లా నుంచేకాక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి మిర్చి తరలివస్తున్నది. రోజుకు కనీసం 60 వేల బస్తాలకు తగ్గడం లేదు. వ్యాపారులు రోజూ ఉదయం నిర్వహించే జెండాపాటలో ధర తగ్గిస్తుండటం, జెండాపాటలో ఖరీదుదారుల మధ్య పోటీ లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జెండాపాటలో మిర్చి క్వింటాల్ గరిష్ఠ ధర రూ.20,800 పలికింది. జెండాపాటకు ఒకరిద్దరు ఖరీదుదారులు మాత్రమే రావడం, మరోవైపు కొందరు వ్యాపారుల గుమస్తాలు పంటకు ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు మండిపడుతూ మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక దశలో మార్కెట్ యార్డు గేట్లను మూసి వేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రవీణ్కుమార్, మార్కెటింగ్శాఖ అధికారి ఎంఏ అలీం, ఉద్యాన అధికారి రమణ, త్రీటౌన్ సీఐ రమేశ్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వచ్చి రైతులతో మాట్లాడారు. పంట నాణ్యతను బట్టే క్రయ విక్రయాలు జరుగుతాయని, జెండా పాటకు ఖరీదుదారులంతా వస్తారని చెప్పడంతో రైతులు శాంతించారు.
మంత్రి తుమ్మల ఫైర్
ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళనపై మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మార్కెటింగ్ డైరెక్టర్తో సమీక్ష నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని ఆదేశించారు.