చెప్పినవి ఇయ్యకుంట కేసీఆర్ మోసం చేసిండు, బ్రిడ్జి కూలిపోయింది, భూములు ఆక్రమించుకుంటుండ్రు అని పుకార్లు చేస్తుండ్రు. ఇయ్యాల మోసాలు ఎందుకువయా? నీ చేతగాని దానికి ఎవరు రమ్మన్నరు?
Telangana | నల్లగొండ ప్రతినిధి, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ‘ఒడ్డున ఉన్నంతసేపు అయ్యా నీ పుణ్యమన్నడు.. ఒడ్కెక్కినంక నేనే పటేల్ అంటున్నడు’ అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఓ రైతు నిప్పులు చెరిగాడు. రేవంత్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన ఆ రైతు వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతున్నది. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు.
బస్టాండ్ ఆవరణలో ధర్నా జరుగుతున్న సమయంలో గుర్రంపోడు మండలం మైలాపురం గ్రామానికి చెందిన రైతు సింగం పర్వతాలు బస్సెక్కేందుకు వచ్చారు. ధర్నాను చూసి అక్కడికి వచ్చి ‘ఈ కాంగ్రెసోళ్లు వచ్చాక అన్నీ మోసాలే.. ఓట్లప్పుడు ఓ తీరుగా, అయ్యాక ఇంకో తీరుగా ఉన్నరు’ అంటూ తన ఆవేదన వ్యక్త పరిచారు. బీఆర్ఎస్ నేతలు వెంటనే ఆయన చేతికి మైక్ ఇచ్చి మాట్లాడాల్సిందిగా కోరారు. మైక్ అందుకున్న పర్వతాలు తన మనసులో గూడుకట్టుకున్న ఆవేదనను వెళ్లగక్కారు.
“రుణమాఫీ చేస్తమని ఓట్లేయించుకున్నరు.. చెయ్యలే. రైతుబంధు ఇస్తా అని ఇయ్యలే. ఎందుకిస్తలేరో చెప్పాలె. కల్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తనన్నడు.. ఇయ్యలే. ఎందుకిస్తలేడు? చెప్పినవి ఇయ్యకుంట కేసీఆర్ మోసం చేసిండు, బ్రిడ్జి కూలిపోయింది, భూములు ఆక్రమించుకుంటుండ్రు అని పుకార్లు చేస్తుండ్రు.
నిజమా? కాదా? ఇట్లా మోసాలు చేసి ఓట్లేయించుకుని మా పేద రైతుల గొంతుమీద కత్తిపెట్టి కోయడం ఎందుకిప్పుడు. ఇయ్యాల మోసాలు ఎందుకువయా? నీ చేతగాని దానికి ఎవరు రమ్మన్నరు? చెప్పాలె” అని రేవంత్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఓ సగటు రైతు తన ఆవేదనను వెల్లడిస్తుంటే ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాడంటూ ప్రశంసలు కురిపించారు.