Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకంపై మొదటినుంచీ అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోమారు అదే పాటపాడారు. యాసంగికి సిద్ధమవుతున్న రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు పడకుండా ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఫిర్యాదును పట్టించుకోవద్దని, సకాలంలో రైతుబంధు విడుదల చేయకుండా యాసంగి సీజన్ ఎత్తిపోయే అవకాశం ఉందని, కాబట్టి రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని రెండుమూడుసార్లు ఈసీని కోరింది. రైతు సంక్షేమం కోసం కాబట్టి నిధుల విడుదలకు ఈసీ తాజాగా ఆమోదం తెలిపింది. రేవంత్రెడ్డికి ఇదికూడా కంటగింపుగా మారింది. రైతుబంధు సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేస్తారని ఆరోపిస్తూ నిధుల విడుదలను అడ్డుకునేందుకు మరోమారు కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనుగోలు కొనాలని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని దుష్ప్రచారానికి దిగారు.
ఎన్నికలకు మూడు రోజుల ముందు రైతుబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో బీఆర్ఎస్కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధమని మరోమారు తేలిపోయిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు వేయడంతో రైతులకు రూ. 5 వేల నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. రైతుబంధుపై రేవంత్ అక్కసు ఇప్పటిది కాదు.. గతంలోనూ ఆయన రైతుబంధును ‘బిచ్చం’గా అభివర్ణించారు. రైతుబంధు సొమ్ముతో రైతులు తాగుతున్నారని అవమానించారు. ఇప్పుడు ఏకంగా రైతుబంధును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘం అనుమతినిచ్చినా మళ్లీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్న రేవంత్పై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.