Miryalaguda | మిర్యాలగూడ, మార్చి 17 : లక్షలు వెచ్చించి పంట సాగు చేస్తే.. నీళ్లు లేక చేతికందాల్సిన పంట ఎండిపోయింది. కాంగ్రెస్ సర్కార్ తీరుకు కడుపు మండిన రైతు ఎండిన పొలానికి మంట పెట్టాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ముల్కలకాల్వ మేజర్ కాల్వ కింద బోరునీటి ఆధారంతో వరిసాగు చేశాడు. పంట పొట్టదశకు వచ్చే వరకు నీరు పారింది.
పొట్ట దశలో బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోవడంతో ఆదివారం ఆయన పంటకు నిప్పు పెట్టాడు. ఇటీవల ఖమ్మం జిల్లాకు నీరు వదిలిన సమయంలో మేజర్ కాల్వలకు నీరు వదిలి ఉంటే పంట చేతికి వచ్చేదని రైతు సైదులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదెకరాల పొలం సాగుకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వాపోయాడు. 15 రోజులపాటు నీరు పారినట్లయితే పంట చేతికి వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సాగర్ కాల్వకు నీరు వదలకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.