జూలూరుపాడు, డిసెంబర్ 19: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయలేదన్న అక్కసుతో ఆ పార్టీ నాయకుడు ఓ రైతుకు పంటనష్టం కలిగించి రాక్షసానందం పొందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంగారంతండాలో కొర్రా చిన్నరాములు తన రెండెకరాల్లో సాగుచేసిన వరి పంటను నూర్పిడి చేసి పంట పొలంలోనే కల్లం చేసి ధాన్యాన్ని ఆరబోశాడు. శుక్రవారం ఉదయం కల్లం వద్దకు వెళ్లి చూడగా ధాన్యం మొత్తం నీటిలో తేలియాడుతూ కనిపించింది. దీంతో లబోదిబోమంటూ రైతు, కుటుంబసభ్యులు చుట్టుపక్కల రైతులను పిలిచి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ధాన్యం మొత్తం తడిసి రంగుమారడంతో గ్రామంలోని రహదారిపై పోసి గ్రామస్తులతో కలిసి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నరాములు చేను పక్కనే కాంగ్రెస్ నాయకుడు కొర్రా సామ్య మిర్చిపంటను సాగుచేస్తున్నాడు. గురువారం రాత్రి సామ్య తన మిర్చితోట నుంచి నీళ్లు పెట్టి పక్కనే ఉన్న వరిధాన్యం మొత్తం తడిసిపోయేలా నీటిని వదిలాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సామ్య బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని చిన్నరాములుని కోరాడు. కానీ చిన్నరాములు ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలుకడంతో అతనిపై సామ్య కోపం పెంచుకున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి మూడు ఓట్లతో గెలిచినప్పటికీ కోపంతో ఉన్న సామ్య గురువారం రాత్రి తన చేనులోని మోటరు ద్వారా మిర్చిపంట మీదుగా వరి కల్లంలోకి నీళ్లు పెట్టి ధాన్యాన్ని తడిపి రాక్షసానందం పొందాడు. చిన్నరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.