హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీకి సంయుక్త కిసాన్ మోర్చా ఎప్పటికీ మద్దతు ఇవ్వదు అని తేల్చిచెప్పారు.
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఆలిండియా రైతు పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతులు గురువారం ధర్నా నిర్వహించారు. రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ హాజరై ప్రసంగించారు.
ఉద్యమంలో మరణించిన రైతులకు కేంద్రం పరిహారం చెల్లించాలి అని టికాయత్ డిమాండ్ చేశారు. రైతు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షలు సాయం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చి రైతులకు అండగా నిలవాలన్నారు. ప్రతీ పంటకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లు రద్దుపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. విత్తన బిల్లు తేకుండా ప్రయివేటు కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇండ్లకు వెళ్తామన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భాష వేరైనా మన భావన ఒక్కటే అని అన్నారు. ఢిల్లీలో ఏడాది పాటు ఉద్యమం కొనసాగడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సాగు చట్టాల రద్దుపై తమకు సందేహాలు ఉన్నాయని టికాయత్ తెలిపారు.
మోదీ సర్కారు ప్రజల ప్రభుత్వం కాదు అని రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మోదీ సర్కార్ కొనసాగుతోందన్నారు. అదానీ, అంబానీ ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోంది. కార్పొరేట్ల లబ్ధికి మోదీ ప్రభుత్వం తాపత్రయపడుతోందని టికాయత్ స్పష్టం చేశారు.