హనుమకొండ, మే 6 : ‘రైతుల కన్నీళ్లతో కాంగ్రెస్ సర్కార్ కొట్టుకుపోవాలి’ అని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు గాజుల గోపాల్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో ఆయన కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మాటల్లో .. ‘సభకు నమస్కారం. వేదికపైనున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నాతోటి రైతాంగానికి విన్నవించునది ఏమనగా.. అయ్యా రైతులు పడే గోస తెల్తాంది. మన దేవుడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చి పదేండ్లలో చెరువుల పూడిక తీసి, నీళ్లు తెచ్చి చెరువులు నింపిండు. ఏడు గండాలున్న నీళ్లను మూడు గండాలకు తేవడంతో అధిక పంటలు పండినయి. ఒక్క గింజ పోకుండా కొని పది రోజుల్లో మన ఖాతాల్లో పైసలేసిన మహనీయుడు కేసీఆర్. 200 ఉన్న పింఛన్ను రూ.2 వేలు చేసిన ఘనత ఆయనదే. నాడు రైతు వేదికలు, మహిళా సంఘాలు, సొసైటీల ద్వారా 10 రోజులకు మించకుండా వడ్లు, మక్కలు కొనేది. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి ఎక్కినంక ఏమి జేత్తున్నాడయ్యా అంటే? నేను చేను వేసి మూడు నెలలైతే పంట పండించిన జొన్నలతో నెల 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నా.. నేనేం జేయాలో మీరే ఆలోచించాలి. ఈ దౌర్భాగ్యానికి, ఈ రైతుల కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవాలే.
నాడు ఎన్నికల ముందు కేసీఆర్ సార్ బ్రహ్మంగారు జెప్పినట్టే చెప్పితే మనమే ఇనలే? కాంగ్రెస్ గెలిస్తే చెప్పులు లైన్లో పెడుతరు.. విత్తనాలు, యూరియా బత్తాలు దొరకయి అని.. చెప్పిండు. మన కేసీఆర్ సార్ మాటలు అస్సలినలే. మార్పు మార్పు అని కాంగ్రెస్కు ఓట్లేసి భంగపడ్డం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మనది మనం నిలబెట్టుకోవాలే. పంటలు నష్టపోతే మా మక్కజొన్న చేనుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రతి కుటుంబానికి ఇచ్చిన ఘనత మా పెద్దికే దక్కుతుంది. అన్ని కంపెనీలు తెచ్చి నర్పంపేటలో పెట్టి అందరికీ పట్టాలిచ్చిండు.. పైపులిచ్చిండు.. ఇంజన్లిచ్చిండు.. ఇలా ప్రతి రైతుకు సాయంజేసిన మహానుభావుడు ఆయన.
అయ్యా మన ప్రభుత్వంలో పదేండ్లు సుఖసంతోషాలతో గడిపినం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎంత గోస పడుతున్నమో తెలుస్తుంది. 22 రోజులుగా జొన్నలు పోసినా కదలడం లేదు? మెదలడం లేదు? ఒక్క రైతువీ కొనడం లేదు. ఈ హింస ఇంకెన్నాళ్లు. రెండేైండ్లెతే మన రైతుల కన్నీళ్లతో వాళ్లు కొట్టుకపోతారు.. నాకు నాలుగెకరాల పొలం ఉంటే రెండు యూరియా బత్తాలు ఇచ్చిండ్రు.. 30 క్వింటాళ్ల జొన్నలు పండితే 25 క్వింటాళ్లే తీసుకుంటరట! మిగతావి ఏంజేయాలె? కాంగ్రెస్ దుర్బుద్ధి పాలన పోవాలంటే మనమందరం మన కేసీఆర్ను తెచ్చుకోవాలి.. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా’ అని గాజుల గోపాల్ తెలిపారు.
వ్యవసాయ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక విత్తనాలు, యూరియా, డీఏపీ దొరకడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతే మిగతా రైతులకు ఇస్తున్నారు. వడ్లు అమ్మే విషయంలో కూడా కాంగ్రెస్ వాళ్లవే ముందుగా కొంటున్నారు. కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయాం.
రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి తాకుతది. మక్కలు అమ్ముకోవాలంటే కాంటా కావడంలేదు. కేసీఆర్ పాలనలో ఎప్పటికపుడు కొనేవారు. కేసీఆర్ ఒక్క బటన్ నొక్కితే రైతుబంధు పడేది. నేడు ఆ పరిస్థితే లేదు. మైకు దొరికితే కాంగ్రెసోళ్లు కేసీఆర్ను తిట్టుడు తప్ప పాలన చేయడం లేదు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మోసపోయినం.