వరంగల్ : విద్యుత్ షాక్తో( Electric shock) రైతు మృతి(Farmer died) చెందిన ఘటన వరంగల్(Warangal )జిల్లా ఖానాపురం మండలంలోని కొడ్తిమాట్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ చందర్(50) తన పొలంలో మక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు. కొద్ది రోజులుగా తన వ్యవసాయ బావిలో నీళ్లులేకపోవడంతో పంట ఎండిపోతున్నది. దీంతో పంటకు నీళ్లు పారించేందుకు పొలం పక్కనే ఉన్న తన బాబాయి సోమ్లా బావి నుంచి నీటిని పారించేందుకు వెళ్లాడు.
మోటరు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై చందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమీప వ్యవసాయ పొలాల్లోని రైతులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వివాహం కాగా, చిన్న కుమారుడికి ఈ నెల 24న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘునాథ్ తెలిపారు.