చండ్రుగొండ, జనవరి 17 : విద్యుత్ షాక్(Electric shock )తో రైతు మృతి(Farmer )చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం.. రావికంపాడు గ్రామానికి చెందిన రైతు కుక్కుల శ్రీనివాసరావు(50) కరెంటు మోటర్తో నీరు పెట్టేందుకు బుధవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు.
ఈ క్రమంలో పొలంలోని విద్యుత్ స్తంభానికి గల సపోర్టింగ్ వైరు తెగి ఉండడాన్ని గమనించాడు. దానిని పొలం గట్టుపై వేసేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించగా దానికి కరెంటు సరఫరా అవుతున్న క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మాచినేని రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరారు.