నర్సింహులపేట, డిసెంబర్ 12: మిరప తోటకు వైరస్ సోకటంతో పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేదని మనస్తాపం చెంది ఓ రైతు ఉరేసుకొన్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జగ్గుతండాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అజ్మీర శ్రీను (42) రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేయగా గుబ్బ రోగం (వైరస్) సోకింది.
సరిగ్గా చేతికి అందే సమయంలో పంట అంతా దెబ్బతిన్నది. దీంతో పెట్టబడి రాదనే మనస్తాపం చెంది ఇంట్లోని రేకుల షెడ్డులో చీరతో ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లాకేంద్రంలోని దవాఖానకు తరలించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.