చేగుంట, మే15: వడగండ్ల వానకు రెండెకరాల్లో పంట నష్టం జరుగడంతో పాటు పెట్టుబడులకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన దాయం నాగరాజు(30) తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు 80 శాతం వడ్లు నేలరాలాయి.
కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపం చెందిన నాగరాజు శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ప్రవళిక, మోక్ష కూతుళ్లు ఉన్నట్లు ఎస్ఐ సృజన తెలిపారు.