హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పూర్తిగా తప్పుల తడకగా ఉన్నదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సీడబ్ల్యూసీకి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ) లేఖ రాశారు. పోలవరం బ్యాక్వాటర్ ముంపుతో ముడిపడి ఉన్న సమస్యలు తేల్చకుండా వాస్తవ విరుద్ధమైన అంశాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే చేయాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)గానీ, ఏపీ ప్రభుత్వంగానీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. బ్యాక్వాటర్ ముం పుపై ఛత్తీస్గఢ్, తెలంగాణతో సయోధ్య కుదిరిందని అఫిడవిట్లో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క అంశంలో కూడా సయోధ్య కుదరలేదని స్పష్టం చేశారు. మరోవైపు, సీడబ్ల్యూసీ దాఖలు చేసిన అఫిడవిట్లో లోపాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని తెలంగాణ నిర్ణయించింది.
11 నుంచి కృష్ణా ట్రిబ్యునల్ విచారణ
విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులపై వచ్చే నెల 11నుంచి కృష్ణా ట్రైబ్యునల్ విచారించనున్నది. ఢిల్లీలో బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీ వాదనలు విననున్నది.