16 లక్షల ఉద్యోగాలు బేతాళ ప్రశ్నేనా… ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి?
ప్రైవేట్ ఉద్యోగాలెక్కడికి పోయాయి? ఉపాధి కల్పించటంలో మోదీ విఫలం
కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకంతో ప్రమాదంలో లక్షల మంది ఉద్యోగులు
తెలంగాణలో 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ
ప్రైవేటులో 16 లక్షల ఉద్యోగ అవకాశాలు
లక్ష పోస్టుల భర్తీకి సాగుతున్న ప్రక్రియ
ఐటీఐఆర్ రద్దుతో ఉద్యోగ కల్పనకు దెబ్బ
ప్రధాని మోదీకి కేటీఆర్ బహిరంగ లేఖ
ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీ బేతాళ ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించింది డాంబికమేనని ఎద్దేవా చేశారు. విదేశీ పరిశ్రమలను రప్పించి యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించటంలో కేంద్రానికి విధానమే లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఏర్పడి 8 ఏండ్లే అయినా తాము ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల్లో లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రైవేట్ రంగంలో మరో 16 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు. ఇటీవలే మరో లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలైందని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీపై ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించిన మంత్రి కేటీఆర్.. గురువారం బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘ప్రజల ఆకాంక్షలు, అలుపెరగని ఉద్యమాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా.. తెలంగాణ యువత తరఫున పలు కీలకాంశాలను మీ (ప్రధాని మోదీ) దృష్టికి తీసుకొస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.
ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రధానిగా మోదీ విఫలం
దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించటంలో ప్రధానమంత్రిగా మోదీ విఫలమయ్యారనే భావన ప్రజల్లో నెలకొన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలు, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ మర్చిపోయారని ధ్వజమెత్తారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని గంభీరంగా చెప్పిన ప్రధాని మోదీ.. మాట్లాడినదంతా డాంబికమే అనడానికి కేంద్రంలో ఎనిమిదేండ్ల పాలనే నిదర్శనంగా కనిపిస్తున్నదని నిప్పులు చెరిగారు. మోదీ అసమర్థ నిర్ణయాలు, ఆర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదని, ఉన్న ఉపాధి అవకాశాలకూ ఆయన గండి కొట్టారని మండిపడ్డారు. ప్రధానిగా మోదీ తీసుకొన్న నోట్ల రద్దు, కరోనా లాక్డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఉద్యోగాలు పోయి పకోడీ ఉద్యోగాలే మిగిలాయన్నది వాస్తవమని వ్యాఖ్యానించారు.
పెట్టుబడులు రప్పించటంలో ప్రధానిగా మోదీ విఫలం
దేశానికి పెట్టుబడులను రప్పించటంలో విఫలమైన ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిద్రపోతున్నారని మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలతోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా, మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అందినకాడికి అమ్ముతూ లక్షల ఉద్యోగాలను రద్దు చేస్తున్నారని విమర్శించారు.
ఉపాధినిచ్చే రెండు రంగాలు నిర్వీర్యం
వ్యవసాయ రంగం, దాని తర్వాత అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ టెక్స్టైల్ రంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి అసలే లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న చిన్న దేశాల కన్నా తకువ మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తున్నదని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఈ రెండు రంగాలను ప్రధాని కావాలని విస్మరించటంతోనే దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. ప్రధాని అనుసరిస్తున్న విధానాల వల్లే గత 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరిగిందని, భారత ప్రభుత్వ గణాంకాలే ఇందుకు తిరుగులేని సాక్ష్యమని గుర్తు చేశారు.
సబ్ కో సత్తెనాశ్.. ఇదే మీ వైఖరా?
సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని ప్రధాని మోదీ ఓవైపు గప్పాలు కొడుతుంటే బీజేపీ నేతలు మాత్రం సబ్ కో సత్తెనాశ్ కరో అన్నట్టు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వైఖరి వల్ల దేశంలోనే కాకుండా విదేశాల్లోని భారతీయుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ విద్వేష రాజకీయాలతో పారిశ్రామికంగా వెనుకబడే ప్రమాదంలోకి మన దేశం వేగంగా వెళ్తున్నదని, కోట్ల మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీరు గతంలో కూడా తెలంగాణకు వచ్చి తియ్యగ, పుల్లగ మాట్లాడిన్రు. కానీ, పైసా సాయం చెయ్యలేదు’ అని మోదీపై మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే మోదీ.. తెలంగాణ గడ్డ మీది నుంచి దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనపై వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సమాధానం చెప్పకపోతే తెలంగాణ యువతతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేలా, ఉద్యోగాల భర్తీ జరిగే వరకు ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
ఉపాధి కల్పనకు తెలంగాణలో రెండంచెల వ్యూహం
నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదంతో తెలంగాణ సాధించి, ఎనిమిదేండ్లుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం అద్భుతమైన కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండంచెల వ్యూహంతో పనిచేస్తున్నామని వివరించారు. కొత్త రాష్ట్రమైనా వినూత్న, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో రూ. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి తెచ్చామని గుర్తు చేశారు. త్రికరణశుద్ధిగా తాము చేస్తున్న ప్రయత్నాలతో ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకొన్నదని వెల్లడించారు. దేశ ప్రధానిగా ఈ విషయంలో మీకు(మోదీ) తగిన సమాచారం ఉండే ఉంటుందని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కారు పురోగతిని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రమే లెకలేనన్ని సార్లు ప్రశంసించిందని గుర్తు చేశారు. తమది ఒట్టిమాటల ప్రభుత్వం కాదు.. గట్టి చేతల ప్రభుత్వమని ప్రజలతో శభాష్ అనిపించుకొంటున్నామని తెలిపారు. ఒక రాష్ట్రంగా పరిమిత వనరులతోనే భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను తమ ప్రజలకు కల్పిస్తున్నామని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.