ఓట్ల కోసం బీజేపీ తప్పుడు వాగ్దానాలు
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్నారు
ఇప్పటికీ అన్నదాతల పరిస్థితి మారలేదెందుకు?
ఉచిత విద్యుత్తు అని యూపీలో అమిత్ షా హామీలు
తెలుగు రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్ల బిగింపెందుకు?
హైదరాబాద్, ఫిబ్రవరి 16 : ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ.. మరోసారి అదే పల్లవి అందుకొన్నారు. తాజాగా, పంజాబ్లో బీజేపీకి అవకాశం ఇస్తే ఐదేండ్లలో వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తామని ఉపన్యాసాలు దంచేస్తున్నారు. గతంలో చెప్పిన అబద్ధాన్నే మళ్లీ అస్త్రంగా చేసుకొని ఏక్ ఔర్ బార్ ఝూటా మాట చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తానేమీ తక్కువ కాదన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీని ఎన్నికల్లో గెలిపిస్తే వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు ఇస్తామని హామీ ఇస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లో రైతులకు ఉరివేస్తూ, మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న మోదీ సర్కార్.. ఉత్తరాది రాష్ర్టాల్లో మాత్రం ఉచిత విద్యుత్తు ఇస్తుందట అని నెటిజన్లు విమర్శలు గుప్తిస్తున్నారు. అన్నదాతల పరిస్థితి ఇంకా ఎందుకు మారలేదు? తెలుగు రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు? అని నిలదీస్తున్నారు.
వాగ్దానం- ప్రధాని మోదీ
(ఉత్తరప్రదేశ్లోని బరేలీలో 2016 ఫిబ్రవరి 28న)
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో 2016 ఫిబ్రవరి 28న బహిరంగసభలో ప్రధాని మోదీ తొలిసారిగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వాగ్దానం ఇచ్చారు. ‘వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఉత్తరప్రదేశ్ భూభాగం నుంచి నేను అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలను కోరుతున్నాను. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. అందుకు మేం ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశాం. మీరు దాన్ని అమలు చేయడమే తరువాయి’ అని భారీ డైలాగ్లు కొట్టారు. మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటకలోనూ రైతుల ఆదాయం రెట్టింపు గురించి గొప్పలు చెప్పుకొన్నారు.
వాస్తవం ఇది:
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కాదు.. ఎరువుల ధరల పెంపు వంటి అనేక ప్రతికూల నిర్ణయాలతో రైతుల పెట్టుబడిని పెంచింది కేంద్రంలోని మోదీ సర్కార్. ప్రభుత్వ నివేదికల ప్రకారం 2015-16లో రైతు కుటుంబ నెల ఆదాయం సగటున రూ.8,059 ఉన్నట్టు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ హామీ ప్రకారం 2022 మార్చి నాటికి ఆదాయం (ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటే) రూ.21,146కి చేరాలి. కానీ, 2018-19లో ఎన్ఎస్ఓ (నేషనల్ శాంపిల్ సర్వే) 77వ రౌండ్ అధ్యయనం ప్రకారం ఒక రైతు కుటుంబం నెల ఆదాయం రూ.10,218 మాత్రమే. ఇదేరీతిన పెరిగితే 2022 నాటికి రైతుల ఆదాయం నెలకు కేవలం రూ.12,955 మించబోదని అంచనాలు చెప్తున్నాయి. ఈ ఆదాయం కూడా పంటల మీద కాకుండా కూలీ రూపంలోనే పెరిగినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు విషయమై 2020 సెప్టెంబర్లో కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానమిస్తూ..‘2015 నుంచి రైతు కుటుంబాల ఆదాయం ఎంత పెరిగిందన్న అంచనాలు కేంద్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో లేవు’ అని చెప్పడం కొసమెరుపు.
వాగ్దానం- అమిత్ షా
(ఉత్తరప్రదేశ్లోని దిబియాపూర్లో 2022 ఫిబ్రవరి 15న)
ఎన్ని మాటలు చెప్పైనా సరే నాలుగు ఓట్లు దండుకొంటే చాలన్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఎన్నికల వాగ్దానాల్లో ప్రధాని మోదీని మించిపోయారు. ఈ నెల 15న ఉత్తరప్రదేశ్లోని దిబియాపూర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్షా మాట్లాడుతూ ‘ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఉత్తరప్రదేశ్లోని ఏ రైతు కూడా రానున్న ఐదేండ్ల వరకు విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. ఉచితంగా విద్యుత్తు ఇస్తాం’ అంటూ వాగ్దానం చేశారు.
వాస్తవం ఇది:
విద్యుత్తు సంస్కరణల పేరిట తెలుగు రాష్ర్టాల్లో మోటర్లకు మీటర్లు పెట్టేందుకు తహతహలాడుతున్న కేంద్ర బీజేపీ సర్కార్.. ఉత్తరాది రైతులపై మాత్రం వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నది. ఉత్తరప్రదేశ్లో వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం తెలంగాణతో పోలిస్తే పావు వంతు కూడా ఉండదన్నది నిపుణుల అభిప్రాయం. ఎలాగూ విద్యుత్తు వినియోగం తక్కువే కాబట్టి ఉచిత విద్యుత్తు అని ఉత్తరప్రదేశ్ రైతులకు బీజేపీ ఎర వేస్తున్నదని చెప్తున్నారు. అసలు మతలబు ఏంటంటే.. తెలంగాణలో 26 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. రోజుకు సగటున విద్యుత్తు వినియోగం 250 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుంది. ఇలా రాష్ట్రం మొత్తం వినియోగించే విద్యుత్తులో వ్యవసాయ రంగం వాటా సుమారు 37 శాతం. దేశంలోనే వ్యవసాయానికి అత్యధికంగా విద్యుత్తు వినియోగిస్తున్నది కూడా మన రాష్ట్రంలోనే. 2020 గణాంకాల ప్రకారం యూపీలో కేవలం 10 లక్షల లోపే వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. కానీ, తెలంగాణతో పోల్చితే యూపీలో భూగర్భజలాలు పైనే ఉండడం, కాల్వల వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో తెలంగాణతో పోలిస్తే బోర్ల వినియోగం సగం కూడా ఉండదు. కాబట్టే, బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఉచిత విద్యుత్తు హామీలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకపక్క తెలంగాణలో ఉచితంగా ఇస్తున్న విద్యుత్తుకేమో మోటర్లు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్న బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల నేపథ్యంలో యూపీలో మాత్రం పూర్తి ఉచితం అంటూ ప్రేమ ఒలకబోస్తున్నది. ఇప్పుడు ఉచిత విద్యుత్తు ఇచ్చినా, త్వరలోనే అసలు రూపాన్ని బీజేపీ బయటపెడుతుందని, ఆ మోటర్లకు కూడా మీటర్లు పెట్టి ముక్కుపిండి వసూలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.