నాలుగు రాష్ర్టాల నిరుద్యోగులకు గాలం
ఒక్కొక్కరి నుంచి 15-20 లక్షలు వసూలు
ముఠాను పట్టుకొన్న రాచకొండ పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 : రైల్వే, ఎఫ్సీఐ, ఆర్బీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామని బురిడీ కొట్టించి రూ.కోట్లు కొల్లగొట్టిన ముఠాను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సోమవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో సీపీ మహేశ్ భగవత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. హనుమకొండకు చెందిన పొన్నాల భాస్కర్ హైదరాబాద్లోని కార్ఖానాలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. 2018 నుంచి ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్ టాటాపూర్లో మకాం ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు గాలం వేశాడు. ఢిల్లీ, ముంబై, అస్సాంకు చెందిన అశోక్ సిం ఘాల్, దీపక్ సిన్హా, ఏకే సక్సేనా, దేవేందర్ మిశ్రాతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొన్నాడు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హైదరాబాద్, అస్సాంకు చెందిన నిరుద్యోగులకు గాలం వేయటం వీరి పని. తమ గాలానికి చిక్కగానే నిరుద్యోగులను పొన్నాల భాస్కర్ వద్దకు తీసుకొస్తారు. అతడు తన మాటలతో బురిడీ కొట్టించి ఒక ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తాడు.
ఒరిజినల్ విద్యార్హత పత్రాలను తీసుకొంటాడు. ఆ తర్వాత నకిలీ అపాయింట్మెంట్, ఐడీలను సృష్టించి కొందరికి మెయిల్, మరికొందరికి పోస్ట్ ద్వారా పంపిస్తాడు. అవి నిజమని భావించి నిరుద్యోగులు ఉద్యోగానికి వెళ్తే అసలు మోసం బయటపడుతుంది. ఇలా మోసపోయిన దాదాపు 100 మంది బాధితులు గతేడాది ఢిల్లీ పోలీసు కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. కొన్నిరోజులు సైలెంట్గా ఉండి, తర్వాత కరీంనగర్, హైదరాబాద్లోని జవహర్నగర్కు చెందిన 16 మంది నుంచి రూ.కోటి వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. బాధితులు జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీపీ మహేశ్ భగవత్.. ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పొన్నాల భాస్కర్, అతడి స్నేహితుడు కొండా రితేష్కుమార్ సోమవారం పోలీసులకు పట్టుబడ్డారు. అతడి వద్ద రూ.9 లక్షల నగదు, రెండు కార్లు, నకిలీ ఐడీలు, అపాయింట్మెంట్ లెటర్లను స్వాధీనం చేసుకొన్నారు. ఉద్యోగాల పేరుతోనే కాకుండా, రైస్ పుల్లింగ్, ఆర్బీఐ విదేశీ నిధుల క్లియరెన్స్ వ్యవహారాలు చేస్తానని చాలామంది వ్యాపారుల వద్ద డబ్బు తీసుకొని మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటివరకు అతడు రూ.10 కోట్ల వరకు మోసం చేసినట్టు వెల్లడైం ది. నిందితుడిని కోర్టు అనుమతితో మరోసారి విచారిస్తామని సీపీ తెలిపారు. పరారీలో ఉన్న ముఠా సభ్యు లు అశోక్ సింఘాల్, దీపక్ మిశ్రా, ఏకే సక్సేనా, దేవేందర్ మిశ్రా పరారీలో ఉన్నారన్నారు.