ఖమ్మం, జనవరి 6 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. తమనూ తెలంగాణలో కలుపాలని ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన సరిహద్దు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు అక్కడి పాలకులపై ఒత్తిడి పెరుగుతున్నదని అన్నారు. శుక్రవారం ఆయన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన అభివృద్ధి పనులు, భవనాలు, రోడ్ల ను ప్రారంభించారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచా రం చేస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో సంక్షే మ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రజ ల మన్ననలు పొందుతుంటే ప్రధాని మోదీ మాత్రం ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి విలువ నానాటికీ పడిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్తారన్నారు.
కేసీఆర్ విజన్తో అభివృద్ధి
బీజేపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 740 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి పరిమితం కాగా స్వరాష్ట్రంలో నేడు అది 24 వేల మెగావాట్లకు చేరుకున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మందికి పింఛన్ అందుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.