ములుగు, సెప్టెంబర్21 (నమస్తేతెలంగాణ): స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారి గెలిపిస్తాయని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. గురువారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం 2024లో జరుగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరపై సమీక్ష నిర్వహించేందుకు మేడారం చేరుకున్నారు. ముందుగా సమ్మక్క-సారలమ్మలకు పూజలు నిర్వహించి ఎత్తు బెల్లం సమర్పించారు. జాతరలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతోనే మేడారంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు.
వచ్చే ఏడాది జరుగనున్న జాతర ఏర్పాట్లలో భాగంగా.. రూ.13.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మేజార్టీతో గెలువడం ఖాయమని, మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర స్పష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. దేశం నలుమూలల నుంచి మేడారం వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తుగా పనులను చేపడుతున్నట్టు తెలిపారు. గిరిజన అతిపెద్ద మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని మంత్రి డిమాండ్ చేశారు. మంత్రుల వెంట జడ్పీ చైర్పర్సన్, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, రోడ్లు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలం ఉన్నారు.