హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కంటివెలుగు రెండో విడత కార్యక్రమం నిర్వహణకు రంగం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా నేత్ర పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు చేయించుకునేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కంటి వెలుగులో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా స్క్రీనింగ్ జరుగుతుందని, రిజిస్ట్రేషన్లు, నేత్ర పరీక్షలు, అద్దాల పంపిణీ అంతా ఆధార్ నంబర్ ఆధారంగానే జరుగుతుందని వివరించారు. తద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం వైద్యారోగ్య శాఖ వద్ద నిక్షిప్తమై ఉంటుందని, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు ఇది ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కంటివెలుగుపై వైద్యారోగ్య శాఖ విస్తృత ప్రచారం చేస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో బస్టాండ్లు, మెట్రో పిల్లర్లతోపాటు అన్ని జిల్లాల్లోని బస్టాండ్లు, ఇతర వాణిజ్య ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నది. కంటివెలుగు పరీక్షలకు ఆధార్ తప్పనిసరి అనే అంశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు నిర్ణయించారు. పరీక్ష కేంద్రానికి వచ్చినవారు ఆధార్ కార్డును తెచ్చుకోలేదన్న కారణంతో వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి రాకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
16,533 ప్రాంతాల్లో క్యాంపులు
కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందు కు 1,500 బృందాలను నియమించా రు. ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చి, టూర్ షెడ్యూల్ను అప్పగించారు. నేత్ర పరీక్షలకు అవసరమైన పరికరాలన్నీ సిద్ధం చేశారు. మొత్తం 16,533 ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 12,763 క్యాంపులు, పట్టణాల్లో 3,788 శిబిరాలు నిర్వహించనున్నారు.