హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, 19% ఆయకట్టుకు కేవలం 12.08% జలాల కేటాయింపు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేయాలంటూ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నీటి సమస్యలను పట్టించుకోనందునే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలిపారు. కృష్ణా జలాల వివాద పరిషారానికి సంబంధించిన రెండు ట్రిబ్యునళ్లు తెలంగాణ ఆవిర్భావానికి ముందే ఏర్పడ్డాయని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ నీటి అవసరాలను పట్టించుకోలేదని వివరించారు.
కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు కృష్ణా జలాల్లో సమాన వాటా ఇప్పించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్తో కూడిన ధర్మాసనాన్ని కోరారు. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును పాక్షికంగానైనా అమలు చేసి తమకు నీటిని వినియోగించుకొనే అవకాశాన్ని కల్పించాలని కర్ణాటక చేసిన వాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ట్రిబ్యునళ్ల అవార్డులను పట్టించుకోకుండా కర్ణాటక వేల కోట్ల రూపాయలతో అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించినందున ఆ నష్టానికి ఆ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. కృష్ణా జల్లాల్లో కర్ణాటక 173 టీఎంసీలు వాడుకోవాల్సి ఉండగా ఈ ఏడాదిలో ఇప్పటికే 90 టీఎంసీలు వినియోగించుకున్నదని వైద్యనాథన్ తెలిపారు. ఆలమట్టిలో మరో 90 టీఎంసీలు నిల్వచేసి ఇప్పుడు అత్యవసరంగా గెజిట్ విడుదల చేయాలని కర్ణాటక కోరడం దిగువ ప్రాంతాలకు నీరు దకకుండా చేయడమేనని ఆక్షేపించారు. ఈ అంశంపై తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది.