హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): అంతని, ఇంతని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు.. ఆఖరికి తుస్సుమన్నట్టు తయారైంది. దేశంలో ఆహార సంక్షోభం వచ్చే ప్రసక్తే లేదని, నాలుగైదేండ్లకు సరిపడా గోధుమ, బియ్యం నిల్వలు ఉన్నాయని గప్పాలు కొట్టిన నరేంద్రమోదీ సర్కారు.. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై వరుసగా నిషేధం విధిస్తున్నది. ఇప్పటికే గోధుమ ఎగుమతులను పూర్తిగా నిలిపివేసింది. చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించింది. తద్వారా దేశంలోని రైతులను దారుణంగా దెబ్బ తీయడంతోపాటు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను మంటగలిపింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు బియ్యం ఎగుమతులను సైతం నిషేధించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక కార్యాచరణను కూడా రూపొందించుకొన్నట్టు జాతీయ స్థాయిలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో భారత్ పరువు మరింత పలుచబడే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితికి మోదీ సర్కారు తీరే ప్రధాన కారణమన్న విమర్శలు విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్రంలోని బీజేపీ సర్కారుకు నిర్దిష్ట విధానమేమీ లేదని ఎగుమతిదారులు, వ్యవసాయ నిపుణులు విమర్శిస్తున్నారు. మన దేశంలో ఏ పంట ఎంత ఉత్పత్తి అవుతుంది? ఎంత వినియోగం అవుతుంది? ఏ పంట ఎగుమతికి అవకాశం ఉన్నది? అనే అంశాలపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని మండిపడుతున్నారు. వాస్తవానికి బియ్యం ఎగుమతుల్లో భారత్ది చాలా కీలక పాత్ర. మన దేశం నుంచి దాదాపు 150 దేశాలకు ఏటా 20 మిలియన్ టన్నులకుపైగా బియ్యం ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో 21.4 మిలియన్ టన్నులు ఎగుమతి అయ్యాయి. ప్రస్తుతం ఎగుమతులకు మంచి అవకాశం ఉన్నప్పటికీ దీన్ని సద్వినియోగం చేసుకొని రైతులకు మేలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
దేశ అవసరాలకు సరిపడా పంట ఉత్పత్తి, నిల్వలు లేనప్పుడే ఎగుమతులపై నిషేదం విధిస్తారు. ప్రస్తుతం మన దేశంలో నాలుగైదేండ్లకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, రాష్ర్టాల నుంచి కొనలేమని ఇటీవల కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. అదే నోటితో బియ్యం ఎగుమతికి అవకాశమే లేదంటూ తప్పుడు ప్రకటనలూ చేసింది. ఈ విధానలేమికి పలు రాష్ర్టాలతోపాటు ఎంతో మంది రైతులు బలయ్యారు. అందుకు తెలంగాణే ప్రత్యక్ష ఉదాహరణ. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ససేమిరా అన్న కేంద్ర ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని భీష్మించి కూర్చున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం మరోసారి మడమ తిప్పి బియ్యం ఎగుమతులను నిషేధించేందుకు ఆలోచన చేస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దేశం నుంచి వ్యవసాయ ఎగుమతులు పెరిగితే స్థానికంగా ధర పెరిగి రైతుకు లాభం జరుగుతుంది. కానీ కేంద్రం మాత్రం విధానాల లేమితో అన్నదాతలకు పదేపదే నష్టం కలిగిస్తున్నది. ఎగుమతులపై నిషేధం విధించి రైతుల పొట్ట కొడుతున్నది. ఎగుమతులకు డిమాండ్ ఏర్పడటంతో ప్రస్తుతం క్వింటాల్ గోధుమల మద్దతు ధర రూ.2,015 నుంచి రూ.2,300కు పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు ధాన్యం మద్దతు ధర రూ.1,960గా ఉన్నది. వీటి ఎగుమతులు పెరిగితే ప్రైవేటు వ్యాపారులు అధిక ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. కానీ, ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించనున్నదన్న సమాచారంతో ఎగుమతిదారులు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఓవైపు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్న కేంద్రం.. మరోవైపు రైతులకు మంచి ధర దక్కకుండా చేస్తున్నది. ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ ధరకు కొనేందుకు ఆస్కారం ఉన్నా మోదీ సర్కారు మోకాలడ్డుతున్నది.